Medaram Jathara: మేడారం మహా జాతర ఉత్సవాలు ఈ నెల 21వ తేదీ నుండి పెద్ద ఎత్తున జరగనున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో అతి పెద్ద జాతరైన మేడారానికి ఈ నెల 23వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. వనదేవతలను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోనున్నారు. సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 23వ తేదీన వస్తారని మంత్రి సీతక్క మీడియాకు తెలిపారు. అదే రోజు గవర్నర్ తమిళి సై సౌందరాజన్ కూడా మేడారంకు వస్తారని చెప్పారు.
ఈ జాతర కోసం అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసింది. లక్షలాదిగా భక్తులు తరలివస్తారన్న అంచనాలకు తగిన విధంగా మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. పుణ్యస్నానాల కోసం ప్రత్యేకంగా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
అలాగే లక్షలాది మంది కోసం అవసరమైన మరుగుదొడ్ల నిర్మాణం కూడా పూర్తయిందని తెలిపారు. గవర్నర్, సీఎం ఈ నెల 23న వస్తుండటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తుల కోసం టీఎస్ఆర్టీసీ ఆరువేలకు పైగా బస్సులను ఏర్పాటు చేసింది. మేడారం జాతర 21వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నా వేలాది మంది భక్తులు ముందుగానే వనదేవతలను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు.
ఈ ఏడాది మొదటి సారిగా మేడారం భక్తులకు ప్రభుత్వం ఆన్ లైన్ సేవలను కూడా ప్రారంభించింది. నేరుగా వనదేవతలను దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకోవడానికి అవకాశం లేని వారు ఇళ్ల వద్ద నుండే అమ్మవారికి బంగారం (బెల్లం) సమర్పించి మొక్కుబడులు చెల్లించుకునేందుకు ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆన్ లైన్ మొక్కుబడుల చెల్లింపు కార్యక్రమాన్ని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
AP DSC: ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స.. పరీక్షలు ఎప్పుడంటే..?