ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీలో రగడ చోటు చేసుకుంది. ఈ టికెట్ను సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ను తప్పించి.. నాన్లోకల్ నాయకుడు సుధీర్కు పార్టీ టికెట్ కేటాయించింది. అయితే.. దీనిని పార్టీ సీనియర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి.. జనంలోకి రావాలని నిర్ణయించుకున్నారు. నందికొట్కూరు వైసీపీ నియో జకవర్గ బాధ్యతలను లోకల్ నాయకులకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో నందికొట్కూరు నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం నుంచి జనంలోకి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామి సంసిద్ధమయ్యారు. అయితే.. ఈయన వైసీపీ నాయకుడిగానే జనం లోకి వెళ్తారా? లేక.. స్వతంత్రంగా వ్యవహరిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. స్థానికంగా బలం ఉన్న వెంకట స్వామి.. వచ్చే ఎన్నికల్లో ఆర్థర్కు ఇవ్వకపోతే.. తనకు టికెట్ ఇవ్వాలని బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే.. పార్టీ యువ నాయుడు బైరెడ్డి చెప్పిన వారికే పార్టీ టికెట్ ఇస్తామనే వాదన వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే నందికొట్కూరు నుంచి అనూహ్యంగా సుధీర్ దారా పేరు వెలుగు చూసింది. దీంతో స్థానికంగా నాయకులు మండి పడుతున్నారు. ఇక, ఆర్థర్ ఇప్పటికే మౌనంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను బలిపశువును చేశారని.. ఆయన చెబుతున్నారు. టీడీపీవైపు చూస్తున్నా.. ఆయనకు గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇలాంటి సమయంలో అనూహ్యంగా వెంకటస్వామి రాజకీయం పుంజుకోవడం గమనార్హం. తనతో కలిసి వచ్చే వారంతా రావాలని.. అధిష్టానం ఎందుకు వెనక్కి తగ్గదో చూస్తానని కూడా ఆయన కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాదు.. నందికొట్కూరు నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై దృష్టి సారించనున్నట్టు లబ్బి వెంకటస్వామి చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వివాదాలకు దూరంగా ప్రజలకు మేలు చేస్తానని చెబుతున్నారు. తన కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నట్టు వెంకటస్వామి తెలిపారు. ఇక, ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వైసీపీ అధిష్టానం.. బైరెడ్డిని అలెర్ట్ చేసినట్టు తెలిసింది. ఆయన ద్వారా వెంకటస్వామిని లైన్లో పెట్టే వ్యూహానికి తెరదీసినట్టు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.