అదేంటి? అనుకుంటున్నారా? అదేనండి.. కశ్మీర్ ఫైల్స్, గుజరాత్(గోద్రా) ఫైల్స్, ఇప్పుడు రాజధాని ఫైల్స్ తరహాలో త్వరలోనే బొత్స బుక్ కూడా తెరమీదికి రానుంది. అయితే. అది ఎన్నికలకు ముందా.. మధ్యలోనా.. తర్వాతా? అన్నది సస్పెన్స్లో ఉంది. ఇంతకీ విషయం ఏంటంటే.. వైసీపీ సీనియర్ నాయ కుడు, మంత్రి బొత్స సత్యనారాయణ దాదాపు 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. విజయనగరం జిల్లాలో ఒకప్పుడు.. ఇప్పుడు కూడా.. తిరుగులేని ఆధిపత్యంతో ముందుకు సాగుతున్నారు.
అయితే.. ఆయన గత అనుభవసారాన్ని పిండి.. పుస్తకం రాస్తున్నారట. అది కూడా ఉమ్మడి ఏపీలో జరిగిన కీలక పరిణామాలను అందులో వండి వార్చుతారట. తాజాగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. త్వర లోనే ఈ పుస్తకాన్ని తీసుకువస్తానన్నారు. దీనిలో తనకు సీఎంకాకుండా.. అడ్డుపడింది ఎవరు? వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి? అనే విషయాలను కూడా పూస గుచ్చినట్టు వివరిస్తానని చెప్పారు. అయితే. ఇదంతా కూడా ఎన్నికల వ్యూహమేనన్నది విశ్లేషకుల మాట.
కాపుల్లో చిచ్చు…
బొత్స తాజాగా చేసిన కామెంట్లు వింటే.. కాపులను మెగా కుటుంబానికి దూరం చేయాలన్న వ్యూహం స్ప ష్టంగా కనిపిస్తోంది. `ఉమ్మడి రాస్ట్రంలో నాకు ముఖ్యమంత్రి పదవి రావాల్సి ఉంది. అయితే.. దీనిని రాకుండా. అడ్డు పడింది చిరంజీవే. ఆయనకు తన కుటుంబానికే పదవులు దక్కాలన్న ఆలోచన ఉంది. అందుకే.. కాపునైన నాకు అన్యాయం చేశారు` అని బొత్సవ్యాఖ్యానించారు. తద్వారా.. బొత్స సామాజిక వర్గంలో కలకలం రేపేలా వ్యాఖ్యానించారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. అప్పట్లో ఏం జరిగిందనే విషయాన్ని పుస్తకం రూపంలో తీసుకువస్తామన్నారు.
ప్రస్తుతం టీడీపీ-జనసేన కూటమి వచ్చే ఎన్నికల్లో పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. ఇలాంటి సమయంలో బొత్స చేసిన వ్యాఖ్యలు సహజంగానే కాపుల్లో చర్చనీయాంశం అయ్యే అవకాశం ఉంది. ఆయన ద్వారా.. వైసీపీ పెద్దలు ఇలా వ్యాఖ్యానించారని అంటున్నారు. ఇక, బొత్స చెప్పినట్టు పుస్తకం వస్తే.. అది ఎన్నికల సమయంలోనే కావొచ్చుననే అంచనా కూడా వినిపిస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో. ఏమేరకు బొత్స బుక్ ప్రభావం చూపిస్తుందో చూడాలి.