వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికి 15 సార్లు చంద్రబాబు అనేక మందితో సమీక్షలు నిర్వహించా రు. గత ఏడాదిన్నర కాలంగా ఆయన ప్రతిసారీ.. సమీక్షలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు నేతృత్వంలో స్టీరింగ్ కమిటీని అంతర్గతంగా నియమించిన చంద్రబాబు.. పార్టీ అభ్యర్థుల విషయాన్ని తేల్చాలని గత రెండేళ్ల కిందటే సూచించారు. ఈ క్రమంలో నియోజకవర్గాలు, మండలాల వారీగా కూడా.. కీలక నేతలను పిలిచి.. నాయకులు చర్చించారు.
కొందరిని సర్దు బాటు చేస్తున్నారు. మరికొందరికి సర్దిచెబుతున్నారు. అయితే.. ఎటొచ్చీ. కొన్ని కొన్ని జిల్లా ల్లో ఒకే కుటుంబం నుంచి రెండేసి టికెట్లు ఆశిస్తున్నవారే ఎక్కువగా ఉండడం.. ఆయా స్థానాల్లో ఎక్కువ మంది పోటీ లో ఉండడం పైగా.. పొత్తు పార్టీలు కూడా అవే సీట్లను కోరుతున్న నేపథ్యంలో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు. ఈ విషయాన్ని కొన్నాళ్లు పెండింగులో పెట్టినా.. ఎన్నికలకు సమయం చేరువ అవుతుండడంతో ఏదో ఒకటి తేల్చాలని నిర్ణయించారు.
ఈ క్రమంలోనే టికెట్లు ఆశించిన 15 నుంచి 20 మంది నాయకులను పక్కన పెట్టారు. వారి గ్రాఫ్ సరిగా లేకపోవడంతోపాటు.. ఆర్థికంగా కూడా వెనుకబడి ఉండడం కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇటీవల రాజానగరం.. పార్టీ కీలక నేత.. పెందుర్తి వెంకటేష్ చంద్రబాబును కలిసి.. తన గోడు వినిపించారు. తాను పార్టీ కోసం ఎంతో శ్రమిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. కానీ, చంద్రబాబు ఆయన గ్రాఫ్ను ముందు పెట్టి.. పరిస్థితిని వివరించడంతో ఆయన సైలెంట్ అయ్యారు.
ఇక, పరిటాల కుటుంబం రెండు టికెట్లు ఆశిస్తున్న నేపథ్యంలో ఈ కుటుంబానికి ఒకే టికెట్ అని తేల్చి చెప్పేశారు. నిన్న మొన్నటి వరకు వారి కోర్టులోనే నిర్ణయాన్ని వదిలేసినా. తర్వాత.. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో చంద్రబాబు చొరవ తీసుకుని రాప్తాడు ఒక్కటి ఖరారు చేసినట్టు తెలిసింది. ఇక, జేసీ ప్రభాకర్, దివాకర్ కుటుంబాలకు కూడా ఒకే టికెట్ ఖరారు చేశారు.
అయితే.. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు కుటుంబానికి మాత్రం ఈ దఫా రెండు టికెట్లు ఖరారు చేసినా.. ఆయన అవసరం.. విజయంపై నమ్మకంతోనే ఇస్తున్నట్టు చంద్రబాబు చెబుతున్నారు. మొత్తంగా.. కొన్ని కొన్ని విషయాలపై చంద్రబాబు తాజాగా నిర్ణయం తీసుకోవడంతో చాలా వరకు క్లారిటీ వచ్చేసినట్టేనని అంటున్నారు సీనియర్లు.