ఉత్తరాంధ్రలోని అత్యంత ముఖ్యమైన జిల్లా శ్రీకాకుళం. ఒకరకంగా.. ఇది టీడీపీకి కంచుకోట. అయితే.. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ విజయం దక్కించుకుంది. ధర్మాన ప్రసాదరావు ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కారు. టీడీపీ తరఫున గుండ లక్ష్మీదేవి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఈ రెండు కుటుంబాలే ఇక్కడ గత కొన్నేళ్లుగా గెలుస్తున్న నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి ఈ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉండనుంది? ఎవరు గెలుపు గుర్రం ఎక్కుతారు? అనేది ఆసక్తిగా మారింది.
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలు ఆ పార్టీని ఆదరిస్తూ వస్తున్నా రు. ఇక్కడి నుంచి గుండ కుటుంబ సభ్యులే ఐదుసార్లు విజయం సాధించారు. గడిచిన ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఇంతకు ముందు 2004, 2009లో ఆయన వరుస విజయాలు దక్కించుకున్నారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన తంగి సత్యనారాయణ ఇక్కడి నుంచి విజయం సాధించారు. 1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ అప్పల సూర్యనారాయణ గెలిచి.. ఆ తర్వాత.. వరుస విజయాలు అందుకున్నారు.
అయితే, 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు గెలుపొందారు. టీడీపీ నుంచి పోటీ చేసిన గుండ అప్పల సూర్యనారాయణపై 7227 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లోనూ ధర్మాన వరుస విజయం దక్కించుకున్నారు. అయితే, 2014కు వచ్చే సరికి మాత్రం రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో ధర్మాన ఓడిపోయారు. 2019లో జరిగిన ఎన్నికల్లో ధర్మాన ప్రసాదరావు మరోసారి విజయం సాధించారు.
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఎన్నికల సరళిని పరిశీలిస్తే ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలుపొందే నియోజకవర్గాల్లో ఒకటిగా నిలుస్తూ వస్తోంది. టీడీపీ ఆవిర్భావం తరువాత తొమ్మిది ఎన్నికలు జరగ్గా, టీడీపీ ఆరుసార్లు ఇక్కడ విజయం సాధించింది. ఆరుసార్లులో టీడీపీ నుంచి గుండ కుటుంబ సభ్యులే ఐదుసార్లు విజయం దక్కించుకున్నారు. ఈ జిల్లాలో కీలక నేతగా ఉన్న ధర్మాన ప్రసాదరావు ఇక్కడి నుంచి మూడుసార్లు విజయం సాధించారు. ఈసారి వయసు కారణంగా లక్ష్మీదేవికి సీటు ఇచ్చే విషయంలో టీడీపీ ఆలోచన చేస్తున్నట్టు తెలిసింది. ఇక, వైసీపీ నుంచి ధర్మానే పోటీ చేయనున్నారు. అయితే.. ఈయనపై విమర్శలు, వివాదాలు ఉన్న నేపథ్యంలో ఏమేరకు విజయం దక్కించుకుంటారనేది ఆసక్తిగా మారింది.