వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మంత్రి అమర్నాథ్ దారెటు? విశాఖపట్నం రాజకీయాల్లో ఆయన ఆటలో అరిటి పండేనా? వచ్చే ఎన్నికల్లో ఆయన పరిస్థితి డోలాయమానంలో పడినట్టేనా? ఇదీ.. ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఆయనకు టికెట్ ప్రకటించకపో వడం.. ఉన్న సీటును లాగేసుకోవడం.. ఇతర నియోజకవర్గాల్లోనూ అభ్యర్తులను దాదాపు ఖరారు చేయడంతో మంత్రి అమర్నాథ్ వ్యవహారం ఆసక్తిగా మారింది. మంత్రి అమర్నాథ్ తాతలు, తండ్రుల నుంచి రాజకీయాల్లోనే కొనసాగుతున్నారు. తన తాత గుడివాడ అప్పన్న కాంగ్రెస్ పార్టీలో కొనసాగగా.. అదే కాంగ్రెస్ పార్టీలో తన తండ్రి గుడివాడ గురునాథరావు ఎమ్మెల్యే, ఎంపీగా పలుమార్లు గెలుపొందడంతోపాటు మంత్రిగా కూడా పనిచేశారు.
అప్పటికే ఉత్తరాంధ్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రోణం రాజు సత్యనారాయణకు దీటుగా పార్టీలోనే ఓ వర్గాన్ని తయారు చేశారు. ఉత్తరాంధ్రలో కాపులకు పెద్దదిక్కుగా.. కాపు సామాజిక వర్గ ప్రజలను ఒక తాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన మరణానంతరం ఆయన సతీమణి గుడివాడ నాగమణి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ పెద్దగా రాణించలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఆమెకు సీటు ఇవ్వకపోవడంతో టీడీపీలో చేరి సీటు దక్కించుకున్నారు. విశాఖ వెస్ట్ నుంచి పోటీ చేసి ఓటమిపాల య్యారు. అనంతరం రాజకీయ రంగ ప్రవేశం చేసిన గుడివాడ అమర్నాథ్ తొలుత టీడీపీలో చేరినప్పటికీ అనంతర కాలంలో వైసీపీలో చేరి 2014 లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేశారు.
తన గురువైన అవంతి శ్రీనివాస్ చేతులో ఓడిపోయారు. అయితే 2019లో అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి జగన్ వేవ్ లో ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయిపోయారు. ఈ ఐదేళ్లలో పలు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైసీపీ అధికార ప్రతినిధిగా ప్రతిపక్షాలపై విరుచుకుపడటంలో ఆయనకు ఆయనే సాటి.. ఈ రెండు అంశాలే తన సీటుకు ఎసరు పెట్టాయని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో అమర్ విరుచుకుపడడంతో కాపు సామాజిక వర్గంలో పలువురు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని టాక్.
అలాగే అనకాపల్లిలో గవర సామాజిక వర్గం నుంచి కూడా వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఈ అంశాలన్నీ అధిష్టానానికి చేరడంతో మంత్రి అమర్నాథ్ కు సీటు కేటాయించకుండా ఉత్తరాంధ్ర పార్టీ డిప్యూటీ రీజినల్ కోఆర్డినేటర్ గా పదవి ఇచ్చింది. వై వీ సుబ్బారెడ్డి కోఆర్డినేటర్ కాగా.. అమర్ డిప్యూటీగా మెలగనున్నారు. అందుకే ఇటీవల పలు సందర్భాల్లో అమర్ ఎన్నికల్లో పోటీపై నిరాశ పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. “రాజకీయాల్లో అవన్నీ మామూలే.. నా రాజకీయ భవిష్యత్తు జగన్ చూసుకుం టారు.. పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి కట్టుబడి ఉంటాను.. జగన్ గెలుపు రాష్ట్రానికి చారిత్రక అవసరం.. నేను స్టార్ క్యాంపెనర్ గా మారి ఉత్తరాంధ్రలో అభ్యర్థులను గెలిపించుకోవడమే పనిగా నిబద్ధతతో పని చేస్తా“నని చెబుతున్నారు. దీంతో ఇక, అమర్నాథ్ పాలిటిక్స్ ఈ సారికి ముగిసినట్టే అనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.