NTR – Anushka: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలతో సమానంగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకున్న అతి కొద్ది మంది హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకటి. దాదాపు రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్ గా సత్తా చాటుతున్న అనుష్క.. టాలీవుడ్ లో చాలా మంది టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ తనకు ఎంతో ఇష్టమైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో మాత్రం నటించలేకపోయింది. నిజానికి ఎన్టీఆర్, అనుష్క కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అభిమానులు కూడా ఎప్పటినుంచో ఆశపడుతున్నారు. కానీ ఇంతవరకు వీరి కాంబో కార్యరూపం దాల్చలేదు. అయితే గతంలో ఎన్టీఆర్ అనుష్క కాంబినేషన్ లో మూడు క్రేజీ చిత్రాలు మిస్ అయ్యాయి. అవి ఏ సినిమాలో.. ఎందుకు మిస్ అయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అనుష్క శెట్టి నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో `రుద్రమదేవి` ఒకటి. గుణశేఖర్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చారిత్రక చిత్రమిది. టైటిల్ పాత్రను అనుష్క పోషించగా.. అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, కృష్ణంరాజు, నిత్య మేనన్, ప్రకాష్ రాజ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. దాదాపు 60 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన రుద్రమదేవి సినిమా 2015లో తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో విడుదలై ప్రేక్షకులను మెప్పించడంలో విఫలం అయింది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోన గన్నారెడ్డి పాత్ర చాలా బాగా హైలెట్ అయింది. ఆ క్యారెక్టర్ కోసం గుణశేఖర్ మొదట ఎన్టీఆర్ ను సంప్రదించారట. కానీ ఎన్టీఆర్ ఆ పాత్ర చేయడానికి మొగ్గు చూపలేదు. దాంతో ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని అనుష్క కోల్పోయింది.
అలాగే 2008లో విడుదలైన చింతకాయల రవి మూవీ గుర్తుండే ఉంటుంది. విక్టరీ వెంకటేష్, అనుష్క ఈ చిత్రంలో జంటగా నటించారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలపు శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. యోగి డైరెక్టర్ గా వ్యవహరించారు. చింతకాయల రవి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఈ సినిమా ఎన్టీఆర్, అనుష్క కాంబోలో రావాల్సిందట. అవును, మొదట హీరోగా ఎన్టీఆర్ నే అనుకున్నారు. కానీ ఆయన ఇతర ప్రాజెక్ట్లతో బిజీగా ఉండటం వల్ల నో చెప్పారు. దాంతో వెంకీ నటించారు. చింతకాయల రవిలో ఎన్టీఆర్ హీరోగా చేయలేకపోయినా.. అతిథి పాత్రలో మెరిశారు.
ఎన్టీఆర్, అనుష్క శెట్టి కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి మిస్ అయిన చిత్రం ఊసరవెల్లి. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. ఎన్టీఆర్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా యాక్ట్ చేసింది. 2011లో ప్రపంచవ్యాప్తంగా 1,800 స్క్రీన్లలో విడుదలైన ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఇక ఈ సినిమాతో హీరోయిన్ గా తొలిత అనుష్క ను అనుకున్నారు. ఆమెతో సంప్రదింపులు జరపగా.. క్యారెక్టర్ నచ్చకపోవడం వల్ల రిజెక్ట్ చేసింది. దాంతో తమన్నాకు హీరోయిన్ ఛాన్స్ దక్కిందట.