YSRCP: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కేంద్ర కార్యాలయం కోసం నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. శనివారం వేకుమ జాము నుంచే భారీ పోలీసు పహారాలో సీఆర్డీఏ అధికారులు బుల్డోజర్లతో నిర్మాణాలను కూల్చివేశారు.
విషయంలోకి వెళితే.. నీటి పారుదల శాఖ స్థలంలో వైసీపీ పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్ యార్డ్ గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం జగన్ సర్కార్ ఇంతకు ముందు కేటాయించింది. అయితే ఇరిగేషన్ భూమి కబ్జా చేసి ఏ ఒక్క అనుమతి లేకుండా వైసీపీ కార్యాలయం నిర్మాణం చేస్తున్నారనీ, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు సీఆర్డీఏ, ఎంటీఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు.
ఈ అక్రమ నిర్మాణాలపై వైసీపీకి సీఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. నిర్మాణంలో ఉన్న తమ భవనాలను కూల్చివేస్తారని తెలిసి నిన్న (శుక్రవారం) వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. సీఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో హైకోర్టు.. చట్టాన్ని అధిగమించి వ్యవహరించవద్దని సూచించింది. సీఆర్డీఏ అధికారుల దృష్టికి వైసీపీ తరపున న్యాయవాది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలియజేశారు. అయితే.. ఇవేళ వేకువ జామున మున్సిపల్ అధికారుల సాయంతో సీఆర్డీఏ ఈ కూల్చివేతలు జరిపింది.
మరో వైపు సీఆర్డీఏ, మున్సిపల్ అధికారులు హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని వైసీపీ మండిపడుతోంది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి దీనిపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. బాబు సర్కార్ చర్యలపై సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండ ను మరో స్థాయికి తీసుకెళ్లారని మండిపడ్డారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టం, న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్.
ఎన్నికల తర్వాత చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలతో రక్తాన్ని పారిస్తున్న చంద్రబాబు, ఈ ఘటన ద్వారా ఈ అయిదేళ్ల పాలన ఏ విధంగా ఉండబోతుందనే హింసాత్మక సందేశాన్ని ఇవ్వకనే ఇచ్చారని మండిపడ్డారు. ఈ బెదిరింపులకు, ఈ కక్షసాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదు, వెన్నుచూపేది అంతకన్నా లేదని అన్నారు. ప్రజల తరపున, ప్రజల కోసం, ప్రజల తోడుగా గట్టి పోరాటాలు చేస్తాం. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలని కోరుతున్నానన్నారు.
ఈ పరిణామాలు చూస్తుంటే .. ఇంతకు ముందు జగన్ అధికారంలోకి రావడంతో అక్రమ నిర్మాణం అంటూ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజావేదికను కూల్చివేస్తే .. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో అక్రమ నిర్మాణం అంటూ వైసీపీ కార్యాలయ భవన నిర్మాణాలను కూల్చివేశారన్న టాక్ నడుస్తొంది.