సార్వత్రిక ఎన్నికల్లో 64.2 కోట్ల మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది. మరి కొద్ది గంటల్లో వెలువడనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల కోసం యావత్ భరతదేశం ఎదురు చేస్తొంది. ఈ సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేకంగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించింది. ఎన్నికల ముగింపుపై ఈసీ ఇటువంటి సమావేశం నిర్వహించడం ఇదే ప్రధమం కావడం విశేషం.
మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మాట్లాడుతూ .. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య ప్రక్రియ ను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ఈ ఎన్నికల్లో 64.2 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోవడంతో మన ప్రపంచ రికార్డు సృష్టించినట్లు వెల్లడించారు. జీ 7 దేశాల్లోని మొత్తం ఓటర్ల కంటే ఈ సంఖ్య 1.5 రెట్లు ఎక్కువ అని అన్నారు. ఐరోపా సమాఖ్యలోని 27 దేశాల ఓటర్ల కంటే 2.5 రెట్లు ఎక్కువ కావడం విశేషమన్నారు. ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు పోటెత్తారనీ, 31.2 కోట్ల మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో మహిళా ఓటర్లకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు.
85 ఏళ్లు పైబడిన ఓటర్లు ఇంటి వద్దే ఓటు వేశారన్నారు. 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రీపోలింగ్ అవసరం రాలేదన్నారు గత ఎన్నికల్లో 540 చోట్ల రీపోలింగ్ నిర్వహించగా, ఈ సారి ఆ సంఖ్య 39 కు తగ్గిందన్నారు. ఇందులో కేవలం రెండు రాష్ట్రాల్లోనే 25 చోట్ల రీపోలింగ్ జరిగిందన్నారు. గత నాలుగు దశాబ్దాలతో పోలిస్తే జమ్మూకశ్మీర్ లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైందన్నారు. మొత్తం అక్కడ 58.58 శాతం ఓటర్లు తమ ఓటు హ క్కు వినియోగించుకున్నారన్నారు. కశ్మీర్ లోయలో 51.05 శాతం పోలింగ్ నమోదు అయ్యిందని చెప్పారు.
ఎన్నికల్లో నగదు ప్రవాహాన్ని విజయవంతంగా అడ్డుకున్నామని తెలిపారు. పది వేల కోట్ల విలువైన నగదు, కానుకలు, డ్రగ్స్, మధ్యాన్ని ఎన్ ఫోర్స్ మెంట్ ఏజన్సీలు స్వాధీనం చేసుకున్నాయని వివరించారు. 2019 లో ఈ సంఖ్య రూ.3,500 కోట్లుగా ఉందన్నారు. ఈ ఎన్నికల సమయంలో సీ విజిల్ యాప్ లో 4.56 లక్షల ఫిర్యాదులు వచ్చాయని, వీటిలో 99.9 శాతం ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపార. ఇందులో 87.5 శాతం వాటిని వంద నిమిషాల్లోపే పరిష్కారం చూపామని చెప్పారు. డీప్ ఫేక్ వీడియోలను నిలువరించామని వెల్లడించారు.