Chandrababu: కొత్తగా ఎన్నికైన టీడీపీ ఎంపీలతో పార్టీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీలకు కీలక సూచనలు చేయడంతో పాటు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారని వ్యాఖ్యానించారు. బ్యూరో క్రాట్ల పాలన ఎంత మాత్రం ఇక ఉండదని అన్నారు. చంద్రబాబు మారరు అనే అపవాదు తనపై ఉందని, ఇక ముందు అలా ఉండదన్నారు. తన తీరు ప్రత్యక్షంగా మీరే చూస్తారని అన్నారు. ఎంపీలు అందరు తరచూ వచ్చి తనను కలవాలని సూచించారు. తాను బిజీగా ఉన్నా కూడా పక్కకు వచ్చి మాట్లాడి వెళ్తానని తెలిపారు.
టీడీపీ కార్యకర్తలు, నేతలు ఈ అయిదేళ్లు చాలా కష్టపడ్డారనీ, కత్తి మీద పెట్టినా జై టీడీపీ, జై చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. అధికార పార్టీ వత్తిడికి ఎవరూ తలొగ్గలేదని అన్నారు. ఇక నుంచి ప్రతి అంశం తాను వింటానని తెలిపారు. ఇక ముందు రాజకీయ పరిపాలన ఉంటుందనీ అందరూ కలిసి పని చేయాలన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా కలిసి పనిచేయాలన్నారు. ఎవరి బౌండరీలు ఏమిటో తాను స్పష్టంగా చెపుతాననీ, అందరు ఎవరు పరిధిలో వారు పని చేయాలన్నారు. అందరం కలిసి కార్యకర్తలు, నేతలకు న్యాయం చేయాలన్నారు.
ఈ అయిదేళ్లు కార్యకర్తలు, నేతలు పడిన ఇబ్బందులు నాకు చాలా మనోవేదన కలిగించాయన్నారు. వారి కష్టం, వారి త్యాగం, కృషి వలనే ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఈ నెల 12వ తేదిన తాను ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీని ఆహ్వానించానని, సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ సారి ఎన్నికైన ఎంపీల టీమ్ చాలా బాగుందనీ, గతంలో ఎర్రంనాయుడు ఉన్నప్పుడు ఇటువంటి టీమ్ ఉందని అన్నారు. ఈ టీమ్ ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాల కోసం బాగా పని చేయాలని చంద్రబాబు సూచించారు.
ప్రజలు ఇచ్చిన తీర్పుతో ఎవరూ ఆకాశంలో ఎగరవద్దని హెచ్చరించారు. ప్రజలు నమ్మకంతో ఇచ్చిన విజయాన్ని బాధ్యతగా సమాజ సేవ చేసేందుకు వినియోగించాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోని వైసీపీ ఎంపీలు.. జగన్ కేసుల మాఫీ అజెండాతోనే ఢిల్లీలో పైరవీలు చేశారని అన్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలే మనందరి ప్రథమ కర్తవ్యం కావాలని అన్నారు.