YS Jagan: ఓటమి తర్వాత తొలి సారి పార్టీ నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఓడిన నేతలతో జగన్ మాట్లాడారు. ఎవరూ అధైర్య పడొద్దని, మనకు రావాల్సిన ఓట్ షేర్ వచ్చిందని వారితో జగన్ చెప్పినట్లు తెలుస్తోంది.
ఎన్నికలు జరిగిన తీరుపై పలువురు నేతలు అధినేత ఎదుట సందేహాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. పార్టీకి పట్టున్న గ్రామాల్లోనూ ఓట్లు రాకపోవడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారుట. ఈవీఎంల వ్యవహారంపై ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో తీవ్ర అక్రమాలకు పాల్పడ్డారని నేతలు జగన్ దృష్టికి తీసుకువచ్చారు.
కూటమి నేతలకు కొందరు అధికారులు, పోలీసులు సహకరించారనీ, వైసీపీ నేతలను ఉద్దేశ పూర్వకంగా భయ బ్రాంతులకు గురిచేశారని కొందరు జగన్ కు వివరించారుట. పోలింగ్ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారని చెప్పారుట. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. పార్టీ శ్రేణులకు అండగా నిలవాలని సూచించారు. కార్యకర్తలకు తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు న్యాయపరంగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి.