Manamey: ఒకే ఒక జీవితం వంటి డీసెంట్ హిట్ అనంతరం దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తీసుకున్న ఛార్మింగ్ స్టార్ శర్వానంద్.. రేపు `మనమే` మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మించగా.. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేశాడు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది. అలాగే శ్రీరామ్ ఆదిత్య తనయుడు విక్రమ్ ఆదిత్య, అయేషా ఖాన్, సీరత్ కపూర్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
లండన్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ సినిమాకు హేశం అబ్దుల్ వహాబ్ సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా మనమే సినిమా విడుదల కాబోతోంది. అయితే తాజాగా మనమే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. శర్వానంద్ గత చిత్రం ఒకే ఒక జీవితం మినహా అంతకు ముందు వచ్చిన ఆడవాళ్ళు మీకు జోహార్లు, మహా సముద్రం, శ్రీకారం, జాను చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఒకే ఒక జీవితం సినిమా కూడా రూ. 10 కోట్ల లోపే వసూళ్లను సాధించింది.
అయినప్పటికీ శర్వానంద్ లేటెస్ట్ మూవీ మనమే మంచి బిజినెస్ ను సొంతం చేసుకుంది. తెలుగులో రాష్ట్రాలో ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ లో రూ. 10 కోట్లకు కొనుగోలు చేశారు. ఆంధ్రాలోనే రూ. 5 కోట్లు బిజినెస్ జరిగింది. వరల్డ్ వైడ్ గా మనమే మూవీ టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 11.50 కోట్లు. అంటే శర్వానంద్ ఈ సినిమాతో హిట్ కొట్టాలంటే బాక్సాఫీస్ వద్ద రూ. 12 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ ను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఈ టార్గెట్ ను శర్వా రీచ్ అవుతాడో లేదో తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.
కాగా, శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 450 నుంచి 480 థియేటర్స్ లో శర్వానంద్-కృతి శెట్టి జంటగా నటించిన మనమే రిలీజ్ కాబోతోంది. వరల్డ్ వైడ్ గా 650 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే మనమేతో పాటు రేపు కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ `సత్యభామ`, పాయల్ రాజ్పుత్ `రక్షణ`, నవదీప్ `లవ్ మౌళి` సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాయి. వీటిల్లో సత్యభామ చిత్రానికి మంచి బజ్ ఉంది.