Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఎటువంటి వార్ జరుగుతుంతో అందరికీ తెలిసిందే. టీడీపీపై తన స్టాండ్ ఏమిటో చెప్పాలని కొందరు, టీడీపీ తరపున ప్రచారం చేయాలని, వీడియో విడుదల చేయాలని మరి కొందరు రకరకాలుగా ఆయనపై వార్తలు వైరల్ అయ్యాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వీటిపై ఏ మాత్రం స్పందించకుండా మౌనంగానే ఉన్నారు. అయినప్పటికీ ఏదో రకంగా ఆయనపై వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా పిఠాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ ఓ డిబేట్ లో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆయనపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వర్మను ఉద్దేశించి అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్ తో ప్రస్తుతం వర్మ మరో సారి వార్తల్లో హైలెట్ అవుతున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే ఆ ఎన్నికల్లోనూ టీడీపీ ఓటమి పాలైంది. ఆ తర్వాత 2014, 2019 ఎన్నికల్లో టీడీపీకి దూరంగా ఉన్నారు. తాజాగా జరిగిన 2024 ఎన్నికల్లోనూ దూరంగా ఉన్నారు.
అయితే ప్రతి ఎన్నికల సందర్భంలోనూ టీడీపీలోని కొందరు జూనియర్ ఎన్టీఆర్ .. పార్టీ ప్రచారంలో పాల్గొంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. తన వారసుడు నారా లోకేష్ కోసం చంద్రబాబే జూనియర్ ఎన్టీఆర్ ను దూరంగా పెట్టారని ప్రత్యర్ధులు ఆరోపణలు చేస్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకుంటేనే పార్టీ బాగుపడుతుందని కొడాలి నాని లాంటి వాళ్లు పలు సందర్భాల్లో కామెంట్స్ చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం నందమూరి, నారా ఫ్యామిలీకి కూడా దూరంగా ఉంటున్నారు.
ఈ తరుణంలో వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు మానేసి ఫుల్ టైమ్ రాజకీయాల్లోకి రమ్మనండి .. ఏదో ఒక పదవి ఇచ్చి కూర్చోబెడతామన్నారు. లోకేష్ తో ఎన్టీఆర్ కు పోలిక ఏముందని అన్నారు. లోకేష్ సిన్సియర్ గా పార్టీ కోసం పని చేస్తున్నారనీ, 60 లక్షల సభ్యత్వం చేశారన్నారు. పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తూ ఉన్నారని , కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చే విధానాన్ని లోకేష్ అమలు చేశారని చెప్పారు. టీడీపీలో ప్రస్తుతం లోకేష్ కీలకంగా మారారని అన్నారు. పార్టీ కోసం త్యాగం చేసే ఉద్దేశం ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వదిలేసి రావాలని, స్వాగతిస్తామని అన్నారు. నందమూరి హరికృష్ణ కు రాజ్యసభ ఇచ్చారని, నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆ కుటుంబానికే లేని బాధ మిగతా వాళ్లకు ఎందుకు అని వర్మ ప్రశ్నించారు.
వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో జూనియర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ఫలితాలు మరి కొద్ది గంటల్లో విడుదల కానున్న తరుణంలో సోషల్ మీడియాలో ఈ చర్చ ఏమిటని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.