కౌంటింగ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఏపీ సీఈవో ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. అమరావతి లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని లెక్కింపు కేంద్రాలను స్వయంగా వెళ్లి ఏర్పాట్లు పరిశీలించినట్లు చెప్పారు. జూన్ 4 ఉదయం 8 గంటల నుండి పోస్టల్ బ్యాలెట్, 8.30 గంటల నుండి ఈవీఎం ఓట్ల లెక్కింపు ఉంటుందని తెలిపారు. ఈ సారి పోస్టల్ బ్యాలెట్లు ఎక్కువగా వచ్చాయని చెప్పారు. 4.61 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారన్నారు. వీటికి ప్రత్యేక కౌంటర్లు ఉంటాయన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గాలకు 2,443 ఈవీఎం టేబుళ్లు, 443 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేశామని సీఈవో తెలిపారు. అసెంబ్లీ నియోజకవర్గాలకు 2,446 ఈవీఎం టేబుళ్లు, 557 పోస్టల్ బ్యాలెట్ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 ప్రాంతాల్లో 401 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రానికి 119 మంది అబ్జర్వర్లను ఈసీ నియమించిందని చెప్పారు.
అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం లెక్కింపునకు 27 రౌండ్లు పడుతుందని.. ఫలితాలు వచ్చేందుకు సుమారు 9 గంటల సమయం పడుతుందన్నారు. రాజమహేంద్రవరం, నరసాపురం లోక్ సభ లో 13 రౌండ్లు ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ఫలితాలు వచ్చేందుకు సుమారు 5 గంటలు పడుతుందని తెలిపారు. భీమిలి, పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గాల్లో 26 రౌండ్లు ఉన్నాయన్నారు. కొవ్వూరు, నరసాపురం లో అయిదు గంటల్లో ఫలితాలు వస్తాయని తెలిపారు.
ప్రతి కౌంటింగ్ హాలులో కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారని, ప్రతి సెంటర్ లో మీడియా రూమ్ లు ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్ ప్రక్రియను మీడియా చిత్రీకరణ చేసుకోవచ్చని చెప్పారు. కౌంటింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్లు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. అయితే మీడియాకు మాత్రం నిర్దేశించిన వరకు ఫోన్లు తీసుకెళ్లవచ్చని మీనా తెలిపారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామనీ, ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భద్రతా బలగాలను మొహరిస్తున్నామని చెప్పారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్ఠ భద్రత ఉంటుందన్నారు.