Modi – Pawan Kalyan: ప్రధాన మంత్రి నరేంద్రమోదీని ఇవేళ (గురువారం) జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా పవన్ తన తనయుడు అకీరా నందన్, సతీమణి అన్నా లెజునోవాను మోదీకి పరిచయం చేశారు. అకీరా భవిష్యత్తు గురించి మోదీ సలహాలు, సూచనలు చేసినట్లు సమాచారం.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 164 సీట్లతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించింది. పవన్ విజయంపై మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఉంది. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్కు ప్రత్యేక స్థానం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.
నిన్న(బుధవారం) సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన ఎన్డీయే మిత్రపక్షాల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మోదీని ముచ్చటగా మూడోసారి ఎన్డీయే పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నెల 9వ తేదీ మోదీ, కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి ఢిల్లీలోనే బస చేసిన పవన్ కళ్యాణ్ ఇవేళ కుటుంబ సమేతంగా మోడీని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ విజయంపై అకీరా ఓ వీడియోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోను అకీరా తల్లి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.