Chandrababu: కౌంటింగ్ కేంద్రాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కౌంటింగ్ ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. జూన్ 4 (మంగళవారం) ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో కూటమి కౌంటింగ్ ఏజెంట్లతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికల్లో కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల్లో ఏజెంట్లు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓట్ల లెక్కింపులో ఏ అనుమానం ఉన్నా వెంటనే ఆర్వోకు ఫిర్యాదు చేయాలన్నారు.
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై రాద్ధాంతం చేయాలనుకున్న వైసీపీకి సుప్రీం కోర్టులోనూ మొట్టికాయలు తప్పలేదని చెప్పారు. ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ కౌంటింగ్ లో హింసకు పాల్పడేందుకు సిద్ధంగా ఉందని ఆరోపించారు. కూటమి కౌంటింగ్ ఏజెంట్లు సంయమనం కోల్పోవద్దని తెలిపారు. నిబంధనలకు విరుద్దంగా కౌంటింగ్ జరుగుతుంటే పట్టుబట్టండని పిలుపునిచ్చారు. ఏజెంట్లు నిర్ధేశిత సమయానికి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లాలని చంద్రబాబు సూచించారు. అన్ని రౌండ్లు పూర్తయ్యే వరకు ఏజెంట్లు ఎవరూ బయటకు రావొద్దని తెలిపారు. కంట్రోల్ యూనిట్ నెంబర్ ప్రకారం సీల్ ను ప్రతి ఏజెంట్ సరి చూసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ 17-సీ ఫాం దగ్గర ఉంచుకుని పోలైన ఓట్లను.. కౌంటింగులో వచ్చిన ఓట్లను సరి చేసుకోవాలన్నారు.
అన్ని రౌండ్లు పూర్తయ్యాక పోలైన ఓట్లకు, కౌంటింగ్ లో వచ్చిన ఓట్లలో తేడాలు ఉంటే వీవీప్యాట్ లు లెక్కిస్తారని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కౌంటింగ్ కు వెళ్లిన ఏజంట్లకు ఏమాత్రం అనుమానం ఉన్నా ఆర్వోకు అభ్యంతరం తెలపాలని సూచించారు. ఆర్వోలకిచ్చిన ఫిర్యాదులపై ఎక్నాలెడ్జ్ మెంట్ తప్పకుండా తీసుకోవాలన్నారు. మనకున్న అభ్యంతరాలపై నిబంధనలు పాటిస్తూనే అధికారులకు ఫిర్యాదు చేయొచ్చని స్పష్టం చేశారు. డిక్లరేషన్ ఫామ్ తప్పుకుండా తీసుకోవాలని.. అనారోగ్య కారణాలతో ఏజంట్ ఎవరైనా రాలేకపోతే నిబంధనల ప్రకారం కౌంటింగ్ కు ముందే మరొకరిని నియమించుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. నిబంధనలు అమలయ్యేలా చూడటంలో ఎవరూ రాజీ పడొద్దని.. ప్రతి ఓటూ కీలకమే అనేది ఏజెంట్లు గుర్తుంచుకుని లెక్కింపు ప్రక్రియలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.