BJP: లోక్ సభ ఎన్నికల కౌంటింగ్, వెలువడే ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ప్రదాన పార్టీలు కౌంటింగ్ వేళ అనుసరించాల్సిన వ్యూహాలపై సమాలోచనలు జరుపుతున్నాయి. ఇప్పటికే ఇండియా కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం నిర్వహించారు.
కాగా, ఇవేళ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఆ పార్టీ సీనియర్ నేతలు సమావేశమైయ్యారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, వినోద్ తావ్డే, మనోహర్ లాల్ ఖత్తార్, అశ్విని వైష్ణవ్, తరుణ్ చుగ్, శివ్ ప్రకాష్, మన్షుక్ మండవీయ, బీఎల్ సంతోష్ సమావేశానికి హాజరైయ్యారు.
ఈ సమావేశంపై ఆ పార్టీ నేతలు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సమావేశంలో ప్రధానంగా విపక్షాలు అనుసరించే వ్యూహాలను సమర్ధవంతంగా ఎదుర్కొనడంపై చర్చించినట్లు తెలుస్తొంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం, ఆ ఫలితాలను తోసిపుచ్చుతూ ఇండియా కూటమి వరుస సమావేశాలు జరుపుతున్న నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితిని బీజేపీ అగ్రనేతలు సమీక్షించినట్లు సమాచారం.
మరో పక్క ఇప్పటికే జూన్ 4న కౌంటింగ్ సమయంలో ఎలాంటి హింస, అశాంతికి తావు లేని విధంగా చర్యలు తీసుకోవాలని ఈసీని బీజేపీ ప్రతినిధుల బృందం కోరింది. దీనికి ముందు ఇండియా కూటమి నేతలు సైతం ఈసీని కలిసి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరిపి వాటి ఫలితాలను ఈవీఎంలో ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడించకుముందే ప్రకటించాలని కోరింది. కౌంటింగ్ ప్రక్రియపై స్పష్టమైన మార్గదర్శకాలను ఎన్నికల ప్యానెల్ జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది.