కరోనా వ్యాక్సిన్కు గాను ప్రపంచ వ్యాప్తంగా అనేక ఫార్మా కంపెనీలు ప్రస్తుతం వ్యాక్సిన్ను తయారు చేసే పనిలో పడ్డాయి. భారత్లో ఇప్పటికే భారత్ బయోటెక్, జైడస్ కాడిలా సంస్థలు ఫేజ్ 1, 2 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్కు గాను డీజీసీఐ నుంచి అనుమతులు పొంది ట్రయల్స్ను నిర్వహిస్తున్నాయి. అయితే ఈ రెండు కాకుండా మరో 5 భారతీయ సంస్థలు కూడా కరోనా వ్యాక్సిన్ రేసులో నిలిచాయి. వీటిలో కొన్ని కంపెనీలు విదేశీ కంపెనీలతో కలసి పనిచేస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఇవి కూడా భారత్లో ట్రయల్స్ను నిర్వహించనున్నాయి.
భారత్ బయోటెక్ తన కోవ్యాక్సిన్ టీకాకు ఫేజ్ 1, 2 క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ఇప్పటికే అనుమతులు పొందింది. వారం కిందటి నుంచే వాలంటీర్లకు వ్యాక్సిన్ను ఇచ్చి పరీక్షిస్తున్నారు. మరో కంపెనీ జైడస్ కాడిలా తన జైకోవ్-డి వ్యాక్సిన్కు క్లినికల్ ట్రయల్స్కు అనుమతులు పొందినా.. ఇంకా ట్రయల్స్ను ప్రారంభించలేదు. 7 నెలల్లోగా ఆ ట్రయల్స్ను పూర్తి చేయాలని జైడస్ కాడిలా భావిస్తోంది.
సీరమ్ ఇనిస్టిట్యూట్ 2020 డిసెంబర్ వరకు కరోనా వ్యాక్సిన్ను మార్కెట్లోకి తెస్తామని చెబుతోంది. ఆ కంపెనీ ఆస్ట్రాజెనికా ఆక్స్ఫర్డ్తో కలిసి పనిచేస్తోంది. ఆగస్టులో వారు తమ వ్యాక్సిన్కు భారత్లో ట్రయల్స్కు అనుమతులు పొందనున్నారు. పనేషియా బయోటెక్ అమెరికాకు చెందిన రెఫానా ఇంక్తో కలిసి వ్యాక్సిన్ కోసం పనిచేస్తోంది.
నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు అనుబంధ సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ కోవిడ్ వ్యాక్సిన్కు ఆస్ట్రేలియాకు చెందిన గ్రిఫిత్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తోంది. బయోలాజికల్ ఈ, మైన్వాక్స్ సంస్థలు కూడా కరోనా టీకా కోసం పనిచేస్తున్నాయి.