సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు.. వాటిలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉంటారని, ప్రజల సమస్యలను పట్టించుకోరని.. చాలా ఆలస్యంగా వస్తారనే.. ఫిర్యాదులు వస్తుంటాయి. ప్రభుత్వ శాఖల్లో పనిచేసే వారు అంటే జనాలకు ఎప్పుడూ ఆగ్రహం కలుగుతూనే ఉంటుంది. అయితే పోస్టల్ శాఖ మాత్రం ఆ అపవాదును తొలగించుకునే పనిలో పడింది. జనాలకు సోషల్ మీడియా వేదికగా సేవలు అందిస్తోంది.
పోస్టాఫీస్ నుంచి లెటర్స్ లేదా పార్సిల్స్ రాని వారు, ఆయా ఐటమ్స్ ఆలస్యంగా డెలివరీ అవుతున్నవారు.. ఎక్కడికో వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన పనిలేదు. చేతిలో స్మార్ట్ఫోన్.. అందులో ట్విట్టర్ యాప్ ఉంటే చాలు.. దాంతో పోస్టల్ శాఖను ట్విట్టర్లో సంప్రదించవచ్చు. ప్రజలు తమ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ట్విట్టర్లో పోస్టల్ శాఖకు చెందిన @IndiaPostOffice అనే అకౌంట్కు ప్రజలు తమ సమస్యలను ట్వీట్ రూపంలో తెలియజేస్తే వెంటనే స్పందిస్తారు. సమస్యలను సంబంధిత విభాగానికి పంపిస్తారు. దీంతో వాటిని వెంటనే పరిష్కరించుకోవచ్చు.
ప్రజలకు పోస్టల్ శాఖ పరంగా ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు గాను ఆ విభాగం వారు ప్రస్తుతం సోషల్ మీడియాలో.. అందులోనూ ట్విట్టర్లో ఎక్కువగా యాక్టివ్గా ఉంటున్నారు. కనుక ప్రజలు ఎవరైనా సరే.. పోస్టల్ పరంగా ఏవైనా సమస్యలుంటే వెంటనే తమ సమస్యలను తెలియజేస్తూ పోస్టల్ శాఖకు ట్వీట్ చేయవచ్చు. వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తారు.