దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి ఎంతగా విస్తుందో అందరికీ తెలుసు. ఉత్తర భారతదేశంలో బిజెపి పునాదులు బలంగా ఏర్పడ్డాయి. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వ్యవస్థలను తమ చేతుల్లో పెట్టుకొని బీజేపీ రాష్ట్రాల్లో సీట్లతో, ఓట్లతో సంబంధం లేకుండా అధికారం కైవసం చేసుకుంటుంది. ఎక్కడ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినా, అక్కడ సంఖ్య బలం తక్కువ ఉన్నా అక్కడ వాలిపోయి గవర్నర్ ల ద్వారా, కోర్టుల ద్వారా, వ్యవస్థల ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు. గడచిన మూడు, నాలుగేళ్లుగా చూసుకున్నట్లైతే కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బీజేపీ చక్రం తిరుగుతూనే ఉంది. ఇదే చక్రాన్ని, ఇదే వ్యూహాన్ని రాజస్థాన్ లో కూడా అమలు చేయాలని అనుకోని బీజేపీ బొక్కబోర్లా పడినట్లే కనిపిస్తోంది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ తమ అమ్ములపొదిలోని అస్త్రాలను బయటకు తీసి ప్రియాంక, రాహుల్ తదితరులు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వర్గం సచిన్ పైలట్ వర్గంతో సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. అవి ఒక కొలిక్కి వచ్చిన్నట్లు తెలుస్తోంది. నేడో, రేపో అధికారికంగా మళ్ళీ సచిన్ పైలట్ కాంగ్రెస్ లో చెరిపోయి తన వర్గం ఎమ్మెల్యేలును ప్రభుత్వానికి మద్దతుగా మార్చనున్నారని సమాచారం.
రాజస్థాన్ రాజకీయం చూడాల్సిందే గురూ..!
రాజస్థాన్ ఎన్నికల్లో అన్నీ తానే అయి నడిపించిన పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ సీఎం పదవిపై ఆశ పెట్టుకున్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. సచిన్ పైలట్ కు 18 మంది ఎమ్మెల్యేల మద్దతుగా ఉండటంతో సీఎం అశోక్ గెహ్లాట్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. సచిన్ పైలట్ తన వర్గీయులతో బీజేపీలో చేరి గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూలదోయనున్నారని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ డిప్యూటీ సీఎం పదవి, పీసీసీ చీఫ్ పదవి నుండి సచిన్ పైలెట్ ను తప్పించారు. అనంతరం సచిన్ వర్గంపై అనర్హత వేటుకు సంబంధించి స్పీకర్ నోటీసులు ఇవ్వడం, తదుపరి ఈ వ్యవహారం హైకోర్టు నుండి సుప్రీం కోర్టు వరకు వెళ్ళింది. సచిన్ పైలట్ వర్గం బీజేపీలోకి వెళ్తుందని అందరూ భావించినా అది జరగలేదు. కాగా ఈ నెల 14వ తేదీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతుండగా, ఈ సమావేశాల్లోనే బలపరీక్ష నిర్వహించాలని అశోక్ గెహ్లాట్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీకి ఆ పార్టీ తమ తమ ఎమ్మెల్యే లను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలు కొనసాగిస్తున్నాయి. సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలు హరియాణాలోని ఒక రిసాట్స్ లో బసచేయగా, గెహ్లాట్ తన వర్గం ఎమ్మెల్యేలను జైసల్మేట్ లో రిసార్ట్ కు తరలించారు. బీజేపీ ఎమ్మెల్యేల క్యాంపు గుజరాత్ లో కొనసాగుతోంది. మరో పక్క ఎమ్మెల్యే లందరికీ సీఎం గెహ్లాట్ లేఖలు రాశారు. సత్యం వైపు నిలవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
రంగంలోకి రాహుల్ గాంధీ
మధ్యప్రదేశ్ లో జ్యోతి రాధిత్య సింధియాతో మాదిరిగా ఇక్కడ రాజస్థాన్ లో కూడా సచిన్ పైలట్ ను బీజేపీ గూటికి చేర్చుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందని కాంగ్రెస్ ఆరోపిస్తుండగా ఆ ఆరోపణలను బీజేపీ ఖండిస్తున్నది. రాజస్థాన్ రాజకీయాలకు సంబంధించి సోమవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సచిన్ పైలెట్ ఢిల్లీకి చేరుకొని కాంగ్రెస్ పెద్దలను కలిశారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా తో భేటీ అయ్యారు. గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న సచిన్ పైలెట్ పార్టీ హైకమాండ్ తో భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. పార్టీలో చీలిక, తాజా రాజకీయ పరిణామాలపై వారి మధ్య చర్చ జరిగిందని, సచిన్ లేవనెత్తిన అభ్యన్తరాలను రాహుల్ గాంధీ పరిశీలిస్తామని హామీ ఇచ్చారని తెలుస్తుంది. రాహుల్ గాంధీ, ప్రియాంక పాచికలు పనిచేస్తే రాజస్థాన్ రాజకీయ సంక్షోభం టీ కప్పులో తుఫాన్ అయినట్లే.