మనకు అందుబాటులో ఉండే అనేక రకాల పండ్లలో యాపిల్ పండ్లు కూడా ఒకటి. ఇవి సీజన్లో తక్కువ ధర ఉంటాయి. అన్సీజన్లో ఎక్కువ ధర పలుకుతాయి. అయితే రోజుకో యాపిల్ పండును తింటే వైద్యుల వద్దకు వెళ్లాల్సిన అవసరమే రాదని చెబుతుంటారు. ఇది నిజమేనా..? నిత్యం ఒక యాపిల్ పండును తింటే.. మనకు ఎలాంటి వ్యాధులు రావా ? డాక్టర్ల వద్దకు వెళ్లాల్సిన పనిలేదా ? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది.
వైద్య నిపుణులు చెబుతున్న ప్రకారం.. మనకు లభించే అనేక రకాల పండ్లలో అత్యుత్తమమైన పండ్లు యాపిల్స్ అని చెప్పవచ్చు. వీటిలో భిన్నరకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్వర్సెటిన్, కటెకిన్, క్లోరోజెనిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్స్ అని పలు రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి అనేక రకాల వ్యాధులు రాకుండా మనల్ని రక్షిస్తాయి. నిత్యం అధిక మొత్తంలో యాపిల్స్ ను తినేవారికి దీర్ఘకాలం పాటు వ్యాధులు రాకుండా ఉంటాయని, ముఖ్యంగా క్యాన్సర్, గుండె జబ్బులు, జీర్ణ సమస్యలు రావని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. 9200 మంది స్త్రీలు, పురుషులకు చెందిన ఆహారపు అలవాట్లను, యాపిల్స్ ను వారు ఎంత మోతాదులో తింటున్నారు, వారికి ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి..? అనే వివరాలను సైంటిస్టులు సుదీర్ఘకాలం పాటు పరిశీలించారు. ఈ క్రమంలో తేలిందేమిటంటే…
సుదీర్ఘకాలం పాటు నిత్యం యాపిల్స్ ను తినడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, అందువల్ల డాక్టర్ను కలిసే అవకాశం రాదని తేల్చారు. అందువల్లే యాపిల్స్ ను నిత్యం తినాలని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. కాగా మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల యాపిల్స్ లో ఎరుపు రంగులో ఉండే యాపిల్స్ ను తినాలని వారు సూచిస్తున్నారు. వాటిల్లోనే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
ఒక మీడియం సైజ్ యాపిల్ ద్వారా మనకు 4 గ్రాముల ఫైబర్ లభిస్తుంది. ఇది మలబద్దకంతోపాటు ఇతర జీర్ణ సమస్యలను రాకుండా చేస్తుంది. అలాగే విటమిన్ ఎ, సిలు, ఇతర ముఖ్యమైన పోషకాలు కూడా యాపిల్ పండ్లలో ఉంటాయి. అందువల్లే రోజుకో యాపిల్ పండునైనా సరే కచ్చితంగా తినాలని వైద్యులు చెబుతున్నారు.