దేశంలోని ప్రజలకు కేంద్రం ఏటా 12 వరకు ఎల్పీజీ సిలిండర్లను సబ్సిడీ కింద అందిస్తుందనే సంగతి తెలిసిందే. ఆ కోటా మించితే పూర్తి ధర చెల్లించి ఎల్పీజీ సిలిండర్ను తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఎల్పీజీ సిలిండర్లపై అందించే సబ్సిడీ మారుతుంటుంది. అందుకనే ప్రజలు ఎల్పీజీ సిలిండర్లను తీసుకున్నప్పుడల్లా సబ్సిడీ మొత్తంలో మార్పులు వస్తుంటాయి. అయితే ఎల్పీజీ సిలిండర్లను తీసుకున్నాక 3 రోజుల్లోగా సబ్సిడీ మొత్తం ఆధార్కు లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. కానీ కొందరికి ఆ సబ్సిడీ మొత్తం అందుతుందా, లేదా అన్న విషయం తెలియదు. అందుకని వారు కింద తెలిపిన విధానాన్ని పాటించాలి. దీంతో వారికి వంట గ్యాస్ సబ్సిడీ అందుతుందా, లేదా అన్న వివరాలు తెలుస్తాయి.
వంట గ్యాస్ సబ్సిడీ అందుతుందా, లేదా అన్న వివరాలు తెలుసుకునేందుకు గ్యాస్ కంపెనీలకు చెందిన వెబ్సైట్లను సందర్శించాల్సిన పనిలేదు. కేవలం ఒకే వెబ్సైట్లో ఏ కంపెనీకి చెందిన సబ్సిడీ వివరాలు అయినా తెలుస్తాయి. అందుకుగాను వినియోగదారులు http://mylpg.in/ అనే సైట్ను సందర్శించాలి. అందులో హోం పేజీలో 17 అంకెల ఎల్పీజీ ఐడీని ఎంటర్ చేయాలి. ఈ ఐడీ గ్యాస్ పాస్ బుక్పై ఉంటుంది. ఈ క్రమంలో ఐడీని ఎంటర్ చేశాక ఓ కొత్త వెబ్పేజీ ఓపెన్ అవుతుంది. అనంతరం అందులో మెయిల్ ఐడీ, పాస్వర్డ్తో రిజిస్టర్ చేసుకోవాలి. తరువాత మెయిల్ ఐడీకి యాక్టివేషన్ లింక్ వస్తుంది. ఆ లింక్ను క్లిక్ చేయడం ద్వారా అకౌంట్ క్రియేట్ అవుతుంది.
ఇక వినియోగదారులు తమ పాన్, ఆధార్ కార్డుల వివరాలతో లాగిన్ చేస్తే అందులో ఎల్పీజీ అకౌంట్కు, బ్యాంక్ అకౌంట్, ఆధార్ నంబర్ లు లింక్ అయ్యాయో, లేదో తెలిసిపోతుంది. దీంతో అందులోనే గ్యాస్ సబ్సిడీ ట్రాన్స్ఫర్ అవుతుందో, లేదో స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. ఇలా ఎప్పటికప్పుడు వంట గ్యాస్ సబ్సిడీ అందుతుందో, లేదో సులభంగా తెలుస్తుంది.