ఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో పాటు వివి ప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఈ నెల 25 న పిటిషన్ పై సమగ్ర విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ప్రతిపక్ష నాయకులు దాఖలు చేసిన ఈ పిటిషన్పై సుప్రీం కోర్టు ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈవీఎంలతో పాటు వివి ప్యాట్ స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య ధర్మాసనం..పిటిషన్ పై స్పందన కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
25న విచారణ సమయంలో ఎన్నికల అధికారి అందుబాటులో ఉండాలని ధర్మాసనం ఆదేశించింది.
చంద్రబాబు సహా 21 పార్టీల నేతలు ఈ అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. న్యాయవాదితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు విచారణకు సంబందించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఈవీఎంలతో అవకతవకలు జరుగుతున్నాయి కావున సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలను వాడకుండా పాత పద్దతిలోనే బ్యాలెట్ పోలింగ్ చేపట్టాలని చంద్రబాబు సహా పలు జాతీయ పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. అందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిరాకరించింది. ఈసీ నిర్ణయంతో సంతృప్తి చెందని నేతలు ఈవీఎంలు ఉపయోగించినప్పటికీ వివి ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.