భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై గత కొంత కాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. పలు మార్లు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తో భేటీ కావడంతో వైసీపీలో చేరి గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఉందంటూ వార్తలు వినబడ్డాయి. అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతున్న నేపథ్యంలోనే సొంత జిల్లాలో అంబటి రాయుడు పర్యటిస్తూ యువతతో సెల్ఫీలు, పెద్దలతో ఫోటోలు దిగుతూ ప్రజలతో మమేకం అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో పర్యటించిన అంబటి రాయుడు అమీనాబాద్ లోని మూలాంకరేశ్వరి దేవి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తర్వాత పాటశాల విద్యార్ధులతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మవారి పుట్టిన గ్రామానికి వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. విద్యార్ధులు ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుని చదవాలని సూచించారు. తాను గుంటూరు ఎంపీ పదవికి పోటీ చేస్తానంటూ వచ్చిన వార్తలు అన్నీ ఊహగానాలేనని అన్నారు. తాను ఇది వరకు సీఎం ను కలిశాననీ, కానీ రాజకీయాలు మాట్లాడలేదన్నారు.
తాను ప్రజా సేవ చేస్తానని కానీ, ఏ ప్లాట్ ఫామ్ నుండి అనేది త్వరలో చెబుతానని వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో ప్రజా సమస్యలు, రైతు సమస్యలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు అంబటి రాయుడు. కాగా అంబటి రాయుడు ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. త్వరలోనే అంబటి రాయుడు అమెరికా వేదికగా జరగబోయే మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ) లో పాల్గొననున్నారు.
చంద్రబాబు నీడ నుండి పవన్ బయటకు రావాలని సూచించిన లక్ష్మీపార్వతి