Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు 35 రోజులుగా చంద్రబాబు కారాగార వాసం చేస్తున్నారు. ఒకటి తర్వాత మరొకటిగా కేసులు చుట్టుముట్టడంతో చంద్రబాబు చేస్తున్న బెయిల్ ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. ఒక్క అంగళ్లు ఘటన కేసులోనే చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు సోమవారం తీర్పు వెల్లడించనున్నది. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ దశలో ఉంది.
చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరుపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. చంద్రబాబు తరపున న్యాయవాదులు ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం 17ఏ వర్తిస్తుందని వాదిస్తుండగా, ప్రభుత్వ తరపు న్యాయవాది 17ఏ వర్తించదని వాదనలు వినిపించారు. ఈ ఎఫ్ఐఆర్ లో 17ఏ కీలకంగా మారింది. ఈ నెల 17వ తేదీ (మంగళవారం) ఫైనల్ వాదనలు జరగనున్నాయి. అలాగే ఫైబర్ గ్రిడ్ కేసులోనూ చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పైనా మంగళవారం సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబుకు సంబంధించి నాలుగు కేసుల్లో ఒక కేసునకు ముందస్తు బెయిల్ రాగా, మిగిలిన మూడు కేసుల్లో బెయిల్ రావాల్సి ఉంది. తొలుత ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన బెయిల్, ముందస్తు బెయిల్ పిటిషన్ లను వాదనల అనంతరం న్యాయమూర్తి డిస్మిస్ చేశారు.
హైకోర్టులోనూ చంద్రబాబుకు పూర్తి స్థాయిలో ఊరట లభించలేదు. ఒక్క కేసులో మాత్రమే ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. ఏపీ సీఐడీ ఇతర కేసుల్లోనూ చంద్రబాబును అరెస్టు చూపేందుకు ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు జారీ చేసింది. ఇలా కేసుల్లో చంద్రబాబు ఉక్కిరి బిక్కిరి అవుతుండగా, అమరావతి అసైన్డ్ భూముల కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ 2021లో మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు సీఐడీ విచారణ చేపట్టింది. అసైన్డ్ భూముల కొనుగోలులో నిబంధనలకు వ్యతిరేకంగా మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ తదితరులు వ్యవహరించారనే అభియోగాలు నమోదు అయ్యాయి. వీటిపైన సీఐడీ విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ కేసు విచారణ జరుగుతుండగానే మార్చి 19న హైకోర్టు స్టే ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత కేసును కొట్టేయాలంటూ మాజీ మంత్రి నారాయణ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. క్వాష్ పిటిషన్ పై విచారణ ముగిసిన తర్వాత హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. ఈ తీర్పు వెల్లడి అవ్వనున్న దశలోనే సీఐడీ హైకోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఐడీ రెండు పిటిషన్ లు హైకోర్టులో దాఖలు చేసింది. ఈ పిటిషన్ లను హైకోర్టు స్వీకరించింది. ఈ కేసులో ఏ 2 నిందితుడుగా ఉన్న మాజీ మంత్రి నారాయణ మరదలు కృష్ణప్రియ ఈ కేసుకు సంబంధించి పలు ఆధారాలు తన వద్ద ఉన్నాయనీ, సీఐడీ విచారణ కు పిలిస్తే వాటి వివరాలు తెలియజేస్తానని ప్రకటించడం సంచలనంగా మారింది.
ఈ కేసులోనూ చంద్రబాబుపై అభియోగాలు ఉండటంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారుట. ఈ కేసులో ఎటువంటి పరిణామాలు దారి తీస్తాయోనన్న ఆందోళన కలుగుతోంది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే చంద్రబాబు తదితరులపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తుండగా, అటువంటిది ఏమీ లేదనీ, అధికారంలో ఉండగా చంద్రబాబు చేసిన అవినీతి అక్రమాలు సీఐడీ విచారణలో బయట పడుతున్నాయని అధికార వైసీపీ నేతలు అంటున్నారు.
మరో పక్క ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసును సీబీఐ, ఇడీ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. 41 మంది ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంలో ప్రభుత్వ న్యాయవాది ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించడానికి తమకు అభ్యంతరం లేదని తెలిపారు. గతంలోనూ సీబీఐ విచారణ చేపట్టాలని కోరినట్లుగా కూడా చెప్పారు.
BRS Manifesto: తెలంగాణలో కేసిఆర్ ఫించన్ల పెంపు హామీలో జగన్ మార్క్