BRS Manifesto: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా హామీలను ప్రకటించారు బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్. ఆదివారం కేసిఆర్ మీడియా సమావేశంలో ఎన్నికల హామీలను వెల్లడించారు. తమ పార్టీయే మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనేక ప్రజాకర్షక హామీలను ప్రకటించారు. తాము మూడో సారి అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను కొనసాగించడంతో పాటు కొత్త హామీలను ఆరు నెలల్లోనే అమలు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం దాన్ని పేదలకు పంచడమనే విధానంతోనే తొలి నుండి తమ ప్రభుత్వం వ్యవహరిస్తొందని అన్నారు. గత ఎన్నికల ప్రణాళికలో చెప్పని పథకాలను సైతం అమలు చేసిన ఘనత తమదేనని అన్నారు.
ఆసరా పెన్షన్ ను రూ.5వేలకు పెంచుతామని ప్రకటించిన కేసిఆర్ .. ఏపీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అమలు చేసిన పింఛనల పెంపు విధానాన్ని ప్రశంసించారు. తమతో పాటు 2వేల పింఛను ఇచ్చిన జగన్ సర్కార్ ఏటా రూ.200 పెంచుతూ రూ.3వేలు చేసిందన్నారు. ఈ విధానం వల్ల ప్రభుత్వంపై ఒకే సారి భారం పడదని అన్నారు. అలానే తెలంగాణలోనూ తొలి సంవత్సరం రూ.3,016లకు పెంచుతామనీ, ఆ తర్వాత ఏటా రూ.500లు చొప్పున పెంచుతూ అయిదేళ్లలో రూ.5,016ల వరకూ పెంచుతామని ప్రకటించారు. అదే విధంగా దివ్యాంగుల పింఛన్ రూ.6వేలకు పెంపు చేస్తామని చెప్పారు. దివ్యాంగుల పింఛన్ తొలి ఏడాది రూ.5వేలకు పెంచి ఆ తర్వాత ఏటా రూ.300లు చొప్పున పెంచుతామని తెలిపారు.
ఇతర హామీలు ఇవి
- రైతుబంధు, దళిత బంధును కొనసాగిస్తాం.
- రైతు బంధును రూ.16వేల చేస్తాం.
- సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట అర్హులైన మహిళలకు నెలకు రూ.3000 భృతి
- తెల్ల రేషన్ కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ
- కేసిఆర్ భీమా ప్రీమియం ప్రభుత్వమే భరిస్తుంది
- గిరిజనులకు పోడు పట్టాల కార్యక్రమం కొనసాగుతుంది.
- గిరిజనులకు మరిన్ని సంక్షేమ పథకాలు తెస్తాం
- తండాలు, గొండుగూడెలను పంచాయతీలుగా చేస్తాం
- బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తాం
- రైతు భీమా తరహాలోనే పేదలకు కేసిఆర్ భీమా పథకం
- తెల్లరేషన్ కార్డుదారులకు రూ.5లక్షల కేసిఆర్ భీమా
- అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్ట్ లకు రూ.400లకే గ్యాస్ సిలెండర్, ఉద్యోగుల తరహాలో జర్నలిస్ట్ లకు కేసిఆర్ ఆరోగ్య రక్ష పేరుతో రూ.15లక్షల వరకు ఆరోగ్య భీమా.
- తెలంగాణలో 93 లక్షలపైగా కుటుంబాలకు కేసిఆర్ భీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం, రూ.5లక్షల భీమా కల్పిస్తాం.
- ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి రూ.15 లక్షలకు పెంచుతాం.
- అగ్రవర్ణాల కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక గురుకుల పాఠశాల
- మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు
- రాష్ట్రంలో అనాధల కోసం ప్రత్యేక పాలసీ
- ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ కోసం కమిటీ ఏర్పాటు