Telangana Assembly Election: తెలంగాణ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరారు. శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్ నందు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్, ఆయన తనయుడు వంశీ పార్టీలో చేరారు. రాహుల్ గాంధీ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. బీఆర్ఎస్ ను గద్దే దింపే సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉందని వివేక్ నమ్మారన్నారు. వివేక్ చేరికతో తమ పార్టీకి వెయ్యి ఏనుగుల బ లం వచ్చిందన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. వివేక్ మాట్లాడుతూ .. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను బీఆర్ఎస్ నెరవేర్చలేకపోయిందని అన్నారు. కేసిఆర్ కుటుంబం వారి ఆకాంక్ష మేరకే పని చేస్తొందని ఆరోపించారు. కేసిఆర్ ను గద్దె దించాలన్న లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు. టికెట్ అనేది అంత ముఖ్యమైన విషయం కాదని వివేక్ వ్యాఖ్యానించారు.
అయితే వివేక్ తనయుడు వంశీ కి చెన్నూరు అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నారని సమాచారం. కుమారుడిని అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపి, పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి వివేక్ పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. దివంగత సీనియర్ కాంగ్రెస్ నేత వెంకట స్వామి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన వివేక్ 2009 లో పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. పార్లమెంట్ లో బొగ్గు మరియు ఉక్కు కమిటీల సభ్యుడిగా పని చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పతాక స్థాయికి చేరిన సమయంలో 2013 లో కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ (బీఆర్ఎస్) పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 మార్చి 31 న తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరరు.
2014 ఎన్నికల్లో పెద్దపల్లి లోక్ సభ స్థానం నుండి పోటీ చేసి ఓటమిపాలైయ్యారు. ఆ తర్వాత 2016లో టీఆర్ఎస్ లో చేరి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైయ్యారు. 2019 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున టికెట్ రాకపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశారు. 2019 ఆగస్టులో బీజేపీలో చేరారు. 2021 అక్టోబర్ లో బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యుడిగా నియమితులైయ్యారు. ప్రస్తుతం బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యుడుగానూ ఉన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వివేక్ బీజేపీకి రాజీనామా చేసి మరో సారి కాంగ్రెస్ పార్టీలో చేరారు.