Telangana Election 2023: తెలంగాణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం మేనిఫెస్టో విడుదల చేసింది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. ముందుగా ప్రకటించిన ఆరు గ్యారెంటీలతో పాటు 36 అంశాలను అందులో చేర్చారు. మేనిఫెస్టోలో కీలక అంశాలను ప్రకటించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలోనే తన నివాసం వద్ద ప్రజల నుండి నేరుగా వినతి పత్రాలను తీసుకునే వారు. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అటువంటి ప్రక్రియ కొనసాగలేదు.
కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితం అవుతారని, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులకు అపాయింట్మెంట్ లు దొరకడం కూడా కష్టమే అన్న అపవాదు ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ గుర్తించినట్లు ఉంది. సీఎం కార్యాలయంలో ప్రతి రోజూ ప్రజాదర్బార్ నిర్వహించడం జరుగుతుందని హామీలో పేర్కొంది కాంగ్రెస్. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలంతో పాటు గౌరవ భృతి అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్య రావ్ ఠాక్రే తదితరులు పాల్గొన్నారు.
ఆరు గ్యారెంటీలు ఇవే
- మహాలక్ష్మి స్కీమ్ – మహిళలకు ప్రతి నెల రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలెండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
- రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, వరి పంటకు క్వింటాల్ కు రూ.500 బోనస్
- గృహజ్యోతి – ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్
- ఇందిరమ్మ ఇళ్లు – ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు రూ.5లక్షలు, ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం
- యువ వికాసం – విద్యార్ధులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్
- చేయూత – రూ.4వేల నెల వారి పింఛను, రూ.10 లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా
ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ కేసిఆర్ మోసాలను ప్రజలకు అర్ధం చేసుకున్నందున అతను పదవీ విరమణ చేసే రోజు వచ్చిందన్నారు. ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసిఆర్ సర్కార్ అవినీతికి పాల్పడిందన్నారు. కొద్ది రోజులుగా కేసిఆర్ కు భయం పట్టుకుందని అన్నారు. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నదన్నారు. మోడీ, కేసిఆర్ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని, జనాలు ఇప్పటికే డిసైడ్ అయిపోయారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు అవసరమైన అన్ని అంశాలు మేనిఫెస్టోలో పెట్టామన్నారు. ఈ మేనిఫెస్టోనే కాంగ్రెస్ పార్టీకి భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని అన్నారు. సర్వ మతాలకు, తెలంగాణ ప్రజలకు ఈ మేనిఫెస్టో అంకితం చేస్తున్నామన్నారు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. కేసిఆర్ కు పదేళ్లు అధికారం ఇచ్చినా ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షాలను కేసిఆర్ కాలరాశారన్నారు. పదేళ్లు అవకాశం ఇస్తే ధనిక రాష్ట్రాన్ని దివాలా తీయించారన్నారు.
పూర్తి మేనిఫెస్టో కొరకు క్లిక్ చేయండి