YS Jagan: తన వ్యాఖ్యలు వక్రీకరించి ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసిందంటూ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జగనన్న మాటే శిరోధార్యమని పేర్కొన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ జగనన్న బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు. రీసెంట్ గా తన ఫెస్ బుక్ లైవ్ వీడియో లో మాట్లాడిన మాటలను ఎల్లో మీడియా వక్రీకరించి బురదజల్లే ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నించడం నేరమా అని ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పద్మావతి తన భర్త అలూరు సాంబశివారెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను ఫేస్ బుక్ లైవ్ లో నీటి కేటాయింపుపై మాత్రమే మాట్లాడానని చెప్పారు. స్థానిక అధికారులు సమస్యల పరిష్కారంపై సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో మాట్లాడానని పేర్కొన్నారు. అయితే తన ఆవేదనను ఎల్లో మీడియా పూర్తిగా వక్రీకరించి హైలెట్ చేసిందన్నారు. తాను సీఎం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని అన్నారు.
ఎల్లో మీడియాలో ప్రచారంలో ఉన్న అంశాలు ఏవీ నిజం కాదనీ వాటిని ఖండిస్తున్నానన్నారు పద్మావతి. ఇప్పటి వరకూ కూడా జగనన్న తన కుటుంబ సభ్యుల్లాగా, సొంత చెల్లెలుగా తనను చూసుకుంటున్నారని తెలిపారు. వారు చెప్పింది వేదవాక్కుగా పని చేయడమే తప్ప.. ఏనాడూ వారికి దిక్కరించే మనస్థత్వం నాది కాదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే పద్మావతి. సీఎం జగన్ తనను మరలా శింగనమల నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేయమన్నా చేస్తాననీ, లేదంటే వేరొకరికి అవకాశమిస్తామన్నా తాను అసెంబ్లీ సీటు వదులుకుని పార్టీకి పని చేసేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు.
తాను వైసీపీ వీడిపోతున్నట్లు, జగనన్న ను వ్యతిరేకిస్తున్నట్లు భిన్న కథనాలు ఎల్లో మీడియాలో రావడం తనకు ఆశ్చర్యం కల్గించిందని పద్మావతి అన్నారు. ఎస్సీలకు జగనన్న చేసిన మేలు రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే గుర్తిండిపోయేలా చేశారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు జగనన్న పరిపాలన పట్ల చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు.
YSRCP: రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు చేసిన వైసీపీ