TDP: మైలవరం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. వసంత వెంకట కృష్ణప్రసాద్ పలువురు నేతలతో కలిసి ఇవేళ హైదరాబాద్ లోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరారు. వసంత కృష్ణప్రసాద్ కు చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
వసంత కృష్ణప్రసాద్ తో పాటు మైలవరం నియోజకవర్గానికి చెందిన ఒక ఎంపీపీ, ఇద్దరు వైస్ ఎంపీపీలు, 12 మంది సర్పంచ్ లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు, ఏడుగురు సొసైటీ అధ్యక్షులు, ఇద్దరు మండల పార్టీ అధ్యక్షులు, నలుగురు కౌన్సిలర్ లు పార్టీలో చేరారు. మైలవరం నియోజకవర్గంలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ మధ్య నెలకొన్ని విభేదాల నేపథ్యంలో వైసీపీ అధిష్టానం ఇటీవల మైలవరం వైసీపీ ఇన్ చార్జిగా తిరుపతిరావు యాదవ్ ను నియమించిన సంగతి తెలిసిందే.
వైసీపీ టికెట్ ఖరారు చేయకపోవడంతో పార్టీపై అసంతృప్తితో ఉన్న కృష్ణప్రసాద్ టీడీపీ లో చేరాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే కృష్ణప్రసాద్ కు టీడీపీ అధిష్టానం సీటు ను ఖరారు చేసినట్లు గా ప్రచారం జరుగుతోంది. టీడీపీలో వసంత కృష్ణప్రసాద్ చేరికను మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తొంది. కాగా, టీడీపీలో చేరిన తర్వాత వసంత కృష్ణ ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను టీడీపీలో చేరినట్లుగా తెలిపారు. గతంలో వైఎస్ జగన్ తనకు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారనీ, రాజధాని అమరావతిలోనే ఉంటుందని చెప్పారని అన్నారు.
ఆ తర్వాత మూడు రాజధానుల ప్రకటన చేశారని, నియోజకవర్గంలో అభివృద్ధికి నిధులు మంజూరు చేయలేదన్నారు కృష్ణప్రసాద్. వైసీపీలోనే కొనసాగుతానని గతంలో తాను చెప్పానని, కానీ సీఎం జగన్మోహనరెడ్డి తనకు ఇచ్చిన హామీలను విస్మరించడం వల్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీలో చేరినట్లు చెప్పారు. పార్టీ ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ నుండి పోటీ చేస్తానని, ఒక వేళ టికెట్ ఇవ్వకుండా పార్టీ కోసం పని చేయాలని ఆదేశించినా అలా పని చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి పాలన తీరుపైనా విమర్శలు గుప్పించారు.
మాజీ మంత్రి, నందిగామ నియోజకవర్గ సీనియర్ నేత వసంత నాగేశ్వరరావు రాజకీయ వారసుడిగా కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వసంత వెంకట కృష్ణప్రసాద్ 1999 ఎన్నికల్లో నందిగామ నియోజకవర్గం నుండి పోటీ చేసి నాటి టీడీపీ అభ్యర్ధి దేవినేని ఉమామహేశ్వరరావు చేతిలో పరాజయం పాలైయ్యారు. ఆ తర్వాత 2004 లో వసంత కృష్ణప్రసాద్ పోటీ చేయలేదు. ఆయన తండ్రి వసంత నాగేశ్వరరావు 2004 ఎన్నికల్లో పోటీ చేసి దేవినేని ఉమా చేతిలో ఓటమి పాలైయ్యారు. ఆ తర్వాత వసంత నాగేశ్వరరావు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా, ఆప్కాబ్ చైర్మన్ గా, నాప్కాబ్ వైస్ చైర్మన్ గా పని చేశారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ 2014 లో టీడీపీలో చేరారు. నాటి నందిగామ నియోజకవర్గ టీడీపీ అభ్యర్ధి తంగిరాల ప్రభాకరరావు గెలుపులో కీలక పాత్ర పోషించారు 2018లో టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గం నుండి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి దేవినేని ఉమాపై విజయం సాధించారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ ఆ పార్టీలో ఇమడలేక ఇప్పుడు మరో సారి టీడీపీ గూటికి చేరారు.
YSRCP: వైసీపీ తొమ్మిదో జాబితా విడుదల .. మంగళగిరి ఇన్ చార్జి మార్పు