YSRCP: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల దృష్ట్యా అధికార వైసీపీ గెలుపు గుర్రాల అన్వేషణలో భాగంగా కీలక మార్పులు చేర్పులు చేస్తొంది. ఈ క్రమంలో ఇవేళ తొమ్మిదవ లిస్ట్ ను రిలీజ్ చేసింది. మొత్తం మూడు స్థానాలకు ఇన్ చార్జిలను నియమిస్తూ జాబితాను విడుదల చేసింది. ఇందులో .. నెల్లూరు లోక్ సభ స్థానానికి సమన్వయకర్తగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని నియమించింది. ఇంతకు ముందు ఇన్ చార్జిగా నియమితులైన రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రేపు టీడీపీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో వేమిరెడ్డి స్థానంలో విజయసాయి రెడ్డిని పార్టీ నియమించింది.
విజయసాయి రెడ్డి మొదటి సారిగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సార్లు రాజ్యసభకు ఎన్నికైయ్యారు విజయసాయి రెడ్డి. ఇక కర్నూల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ నియమితులైయ్యారు. మొన్ననే ఆయన స్వచ్చంద పదవీ విరమణ చేయడం, నిన్న వైసీపీ లో జాయిన్ కావడం, ఇవేళ కర్నూలు టౌన్ ఇన్ చార్జిగా నియమితులు కావడం జరిగింది.
ఇక మంగళగిరిలో టీడీపీ అభ్యర్ధి నారా లోకేష్ కు ప్రత్యర్ధిగా మురుగుడు లావన్యను నియమించింది వైసీపీ. మంగళగిరికి ఇంతకు ముందు గంజి చిరంజీవిని సమన్వయకర్తగా నియమించగా, ఇప్పుడు ఈ స్థానంలో మార్పు చేసింది. చిరంజీవి అభ్యర్ధిత్వాన్ని సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యతిరేకించినట్లుగా వార్తలు వెలువడ్డాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీలో తిరిగి చేరే సమయంలోనే అభ్యర్ధి మార్పుపై ఊహగానాలు వచ్చాయి.
అంతే కాకుండా మంగళగిరిలో పలు సర్వేలు చేసిన అధిష్టానం రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో గంజి చిరంజీవిని తప్పించి ఆ స్థానంలో అదే సామాజికవర్గం (చేనేత, బీసీ)కు చెందిన మాజీ ఎమ్మెల్యే కొండ్రు కమల కుమార్తె మురుగుడు లావన్యను పార్టీ ఇన్ చార్జిగా నియమించింది వైసీపీ. లావన్య మాజీ ఎమ్మెల్యే కమల కుమార్తె కాక ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు కోడలు కూడా.
కాగా, మంగళగిరిలో ఇటీవల జరిగిన వైసీపీ కీలక సమావేశంలో పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల కోసం పార్టీ తరపున ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక 99 శాతం పూర్తి అయ్యిందని, ఒకటి రెండు మార్పులు తప్పించి ఇప్పటి వరకూ ప్రకటించిన ఇన్ చార్జిలకే టికెట్లు దాదాపు ఖాయమని ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్ చార్జిలు ఊరట చెందగా, ఆ తర్వాత ఎనిమిదవ జాబితాలో రెండు ఎంపీ, మూడు అసెంబ్లీ స్థానాలకు, తొమ్మిదో జాబితాలో ఒక పార్లమెంట్, రెండు అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తలను నియమిస్తూ, మారుస్తూ జాబితా విడుదల చేయడం గమనార్హం.
YSRCP: జనసేనకు బిగ్ షాక్ .. వైసీపీలో చేరిన హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్