మంగళగిరి నియోజకవర్గంలో ఈ సారి కూడా వైసీపీనే గెలుస్తుందని వైసీపీ నాయకుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఇక్కడ వైసీపీ జెండానే ఎగురుతుందని కూడా చెప్పుకొచ్చారు. మరి ఈయన ధీమా వెనుక రీజనేంటి? అనేది ఆసక్తిగా మారింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 5333 ఓట్ల తేడాతో ఆయన పరాజయం పాలయ్యారు.
ఈ నేపథ్యంలో పోగొట్టుకున్న చోటే విజయం దక్కించుకుని తీరాలన్న కసితో నారా లోకేష్ ఉన్నారు. ఇక, వైసీపీ ఇప్పటికే తడబాటు పడడం తెలిసిందే. ముందు గంజి చిరంజీవిని సమన్వయకర్తగా పేర్కొన్నారు. దీంతో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటనలు ప్రారంభించారు. కానీ, నారా లోకేష్ బలంగా ఉన్నాడని సర్వేలు చెప్పడం.. గత ఎన్నికల్లో ఓడిపోయారన్నసింపతీ మరింత పెరగడంతోపాటు.. జనసేన కూడా టీడీపీకి కలిసి రావడంతో ఇక్కడ ఈ క్వేషన్లు మారుతున్నాయని.. లోకేష్ గెలుపు ఖాయమన్న అంచనాలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో అనూహ్యంగా వైసీపీ ఇక్కడ సమన్వయ కర్తను మార్చేసింది. వైసీపీ తరపున మురుగుడు లావణ్యకు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. దీంతో నారా లోకేష్ వర్సెస్ లావణ్యల మధ్య పోరు తీవ్రస్థాయిలో జరిగే అవకాశం కనిపిస్తోంది. మురుగుడు హనుమంతరావు కోడలు కావడం, కాండ్రు కమల కూతురు కావడం లావణ్యకు కలిసి వస్తున్న అంశాలు. పైగా బీసీ కార్డు ఉండనే ఉంది.
ఈ నేపథ్యంలో ఇక్కడ పోటీ హోరాహోరీగా సాగే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
ఇదిలావుంటే, లోకేష్ గెలుపు కోసం టీడీపీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేస్తుండటంతో గెలుపు ధీమా లో వున్న ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ భారీ మెజార్టీ సాధన దిశగా సాగుతున్నారు. వైసీపీ అభ్యర్ధి ఎంపికలో జరిగిన అంతులేని జాప్యం ఆపార్టీ శ్రేణులను గందరగోళంలో పడవేసింది. పార్టీ గ్రూపులు లావణ్య గెలుపుకు ఏమేరకు సహకరిస్తాయో వేచిచూడాల్సిందే.
అయితే.. ఎట్టి పరిస్థితిలోనూ గెలిపించి తీరుతామని ఆళ్ల చెప్పడం వెనుక.. బీసీ కార్డు ప్రధాన కారణమై ఉంటుందని అంటున్నారు. పైగా దశాబ్దానికిపైగా ఇక్కడ మహిళ ఎన్నిక కాకపోవడంతో ఈ దఫా మహిళా సెంటిమెంటు అంతా ఆమెకు అనుకూలంగా మారుతుందనే అంచనా వేసి ఉంటారని అంటున్నారు పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.