సాధారణంగా ఏ రాజకీయ పార్టీలో అయినా.. నాయకులు చేరతారు. పైగా ఎన్నికలకు ముందు అయితే.. ఇతర పార్టీల్లో ఉన్న నాయకులు అసంతృప్తులు.. వంటివారు పొరుగు పార్టీలవైపు దృష్టి పెడతారు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. అయితే.. నాయకులను ఆకర్షించవలసిన విషయంలో ఏపీ బీజేపీ పూర్తిగా విఫలమైందనే వాదన వినిపిస్తోంది. వైసీపీలో టికెట్ దక్కదని భావించిన వారు టీడీపీ లేదా జనసేనవైపు చూస్తున్నారు. ఆయా పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు.
కానీ, ఎవరూ కూడా బీజేపీ వైపు చూడడం లేదు. మరి ఆ పార్టీపై నమ్మకం లేకపోవడంతోనో లేక.. పార్టీ చీఫ్ పురందేశ్వరి వ్యవహార శైలి నచ్చకపోవడంతో తెలియాల్సి ఉంది. నిజానికి ఇప్పటి వరకు పది మంది వరకు వైసీపీ నుంచి బయటకు వచ్చారు. వీరిలో ఆరేడుగురు కీలక నాయకులు ఉన్నారు. ముఖ్యంగా కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వంటి వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని తనవైపు ఆకర్షించడంలో బీజేపీ పూర్తిగా విఫలమైంది. అయితే.. మరోవైపు.. బీజేపీ నేతలు పారిశ్రామిక వేత్తలపై దృష్టి పెట్టడం గమనార్హం.
చిన్న చితకా నుంచి భారీస్తాయి వరకు పరిశ్రమలను నడిపిస్తున్నవారిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నంలో బీజేపీ నాయకులు బిజీగా ఉన్నారు. గత నెలలో కొందరు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పారిశ్రామికం గా ఉంటూ.. రాజకీయాలకు దూరంగా ఉన్న వీరిని తమవైపు ఆకర్షించడంలో కమల నాథులు సక్సెస్ అయ్యారు. తాజాగా.. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త రెడ్డప్ప బీజేపీలో చేరారు. స్థానికంగా ఈయనకు మంచి పేరుంది. పైగా.. ఆర్థికంగా బలమైన పారిశ్రామిక వేత్త.
ఈయనను చేర్చుకోవడంతో జిల్లాలో చర్చనీయాంశం అయింది. ఇలా.. పార్టీ నాయకులను కాకుండా.. పారిశ్రామిక వేత్తలను బీజేపీ చేర్చుకోవడం వెనుక రెండు కారణాలు ఉండి ఉంటాయని పరిశీలకులు చెబుతున్నారు. వీరు వైసీపీకి ఫండింగ్ చేయకుండా అడ్డుకోవడం ఒక భాగమైతే.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మేలు చేసేలా.. ఆ పార్టీ అభ్యర్థులను ఆర్థికంగా ఆదుకోవాలనే వ్యూహం ఉండి ఉంటుందని భావిస్తున్నారు. ఇటీవల కూడా గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన పలువురు పారిశ్రామిక వేత్తలు కమలం గూటికి చేరడం విశేషం. అయితే.. ఇక్కడ మరో ప్రశ్న. వారంతట వారే వచ్చి చేరుతున్నారా? లేక.. వారిపై ఒత్తిడి తెస్తున్నారా? అనేది ఆసక్తిగా మారింది.