ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం పి(పాత) గన్నవరం నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ రాజకీయం గందరగోళంగా మారింది. ఇక్కడ నుంచి మహాసేన రాజేష్కు టీడీపీ అధినేత చంద్రబాబు అవకాశం ఇచ్చారు. రాజకీయ యూట్యూబర్గా పేరు తెచ్చుకున్న రాజేష్ ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మంచి వాగ్దాటి, దూకుడు, యువ నాయకుడు కావడంతో పార్టీకి కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేసింది. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి వేరేగా ఉంది.
ఎక్కడ ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన మహాసేన రాజేష్ ను పి.గన్నవరానికి తీసుకురావడంపై స్థాని కంగా ఉన్న టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక, మిత్రపక్షం జనసేన నుంచి కూడా భారీ ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. మరోవైపు.. ఐవీఆర్ ఎస్ సర్వేలోనూ.. ప్రజలు ఆయనకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారు. ఇక్కడ ఎట్టి పరిస్థితిలోనూ స్థానికుడికే అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. దీంతో ఇప్పుడు టీడీపీ అధిష్టానం డైలమాలో పడింది. పరిస్థితి మారుతున్న క్రమంలో మార్పు దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా ప్రముఖ సంఘ సేవకుడు విద్యావేత్త పి గన్నవరం రిటైర్డ్ ఎంపీడీవో ఐ. ఈ. కుమార్ ను పరిశీలిస్తున్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి పిలుపు రావడంతో హుటాహుటిన ఆయన రావడం చంద్రబాబును కలిసి తన బయోడేటాను సమర్పించడం గమనార్హం. ఇక, ఐఈ కుమార్ స్థానికంగా అందరికీ తెలిసిన వ్యక్తి కావడం.. ఎన్నో పనులు చేసి ఉండడంతో ఆయనకు పెద్దగా వ్యతిరేకత ఉండే అవకాశం లేదని సమాచారం.
మరోవైపు.. తనకు ప్రకటించిన టికెట్ విషయంలో వెనక్కి తగ్గేందుకు సిద్ధంగా ఉన్నట్టు మహాసేన రాజేష్ ప్రకటించడం గమనార్హం. తనపై వైసీపీ నేతలు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని.. పార్టీ గెలుపు కోసం ఎలాంటి త్యాగాలకైనా తాను సిద్ధమేనని ఆయన వెల్లడించారు. అయితే.. పార్టీ అధినేత చంద్రబాబు కనుక ఆదేశించి..త ననే కొనసాగాలని కోరితే మాత్రం గెలిచి గిఫ్ట్గా ఇస్తానని చెప్పడం గమనార్హం. మొత్తంగా చూస్తే.. పి.గన్నవరం టీడీపీలో తలెత్తిన ఈ గందరగోళం ఎప్పటికీ ముగుస్తుందో చూడాలి.