టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా కోవర్టులు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పార్టీ టీడీపీలోనూ.. మిత్రపక్షం పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలోనూ వైసీపీ కోవర్టులను పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పటి వరకు చంద్రబాబు నోటి నుంచి రాని ఇలాంటి వ్యాఖ్యలు రావడంతో నాయకులు , పార్టీ కార్యకర్తలు కూడా షాక్కు గురయ్యారు. అయితే..చంద్రబాబు వ్యాఖ్యల అంతరార్థం ఏంటి? అనేది చూస్తే.. టీడీపీలో ఉండి.. టికెట్ రాని కొందరు కోవర్టులుగా ఉండి.. వైసీపీకి సమాచారం ఇస్తున్నారనేది ఆయన కొన్నాళ్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ యువగళం పాదయాత్ర విషయంలో చిత్తూరు జిల్లాలో అలజడి సృష్టించేందుకు వైసీపీ నాయకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో వారికి ఉప్పందించింది సొంత మనుషులేనని గుర్తించిన చంద్రబాబు వారిని పక్కన పెట్టారు. ఇక సొంత పార్టీలోనే ఉంటూ.. ఎక్కడెక్కడ ఎలా వ్యవహరిస్తున్నారనే విషయాలపైనా చంద్రబాబు కొందరిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కోవర్టుల విషయంలో అప్రమత్తంగా ఉంటామని హెచ్చరించారు.
ఇక, మిత్రపక్షం జనసేనకు అనుకూలంగా ఉన్నట్టు ప్రచారం చేసుకుని.. పరోక్షంగా వైసీపీకి మేలు చేస్తున్న వారిపైనా చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన అగ్ర కాపు నాయకులు ఈ జాబితాలో ఉన్నరనేది టీడీపీ సహా జనసేన నాయకుల వాదన. వీరు జనసేనకు అనుకూలంగా ఉన్నారని చెబుతూనే.. సలహాలు, లేఖల రూపంలో పార్టీలో విచ్ఛిన్నం చేసేందుకు.. ప్రయత్నిస్తున్నారనే వాదన ఉంది.
దీనిని కూడా చంద్రబాబు పరోక్షంగా ప్రస్తావించినట్టు పరిశీలకులు చెబుతున్నారు. అయితే, ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. తమ మధ్య విభేదాలు సృష్టించలేరని చంద్రబాబు చెబుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల్లో కోవర్టులను పెట్టారనేది చంద్రబాబు బలమైన ఆరోపణ. పవన్, సహా తన ఆలోచనలు ఒక్కటే అయినప్పటికీ కాపు సామాజిక వర్గం పేరుతో.. సృష్టిస్తున్న అలజడి వెనుక వైసీపీ వ్యూహం ఉందని చెబుతున్నారు. దీనికి తన కోవర్టులను వినియోగించుకుంటోందని అంటున్నారు. మరి దీనిపై ఎలాంటి చర్యలతో ముందుకు సాగుతారో చూడాలి.