విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి టీడీపీ-జనసేన మిత్రపక్షం తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయిన మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నాయకుడు బొండా ఉమామహేశ్వరరావుకు .. కమ్యూనిస్టుల నుంచి భారీ ఎదురు దెబ్బతగులుతుందనే వాదన వినిపిస్తోంది. గత ఎన్నికలను పరిశీలి స్తే.. దాదాపు 29 వేల పైచిలుకు ఓట్లు కమ్యూనిస్టులు ఇక్కడ సంపాయించుకున్నారు. 2019 ఎన్నికల్లో జనసేనతో జట్టుకట్టిన కమ్యూనిస్టులు ఈ సీటు నుంచి పోటీ చేశారు.
సీపీఎం తరఫున మాజీ కార్పొరేటర్ చిగురుపాటి బాబూ రావు ఇక్కడ పోటీ చేశారు. ఆయనకు 29350 ఓట్లు దక్కాయి. ఇక, ఇప్పుడు కాంగ్రెస్తో కలిసి కమ్యూనిస్టులు ముందుకు సాగాలని నిర్ణయించుకున్న దరిమిలా.. మరోసారి బాబూ రావు పొత్తులో భాగంగా ఇక్కడ నుంచి పోటీ చేయడం ఖాయమైంది. ఇప్పటికే ఆయన ప్రజలను కలుస్తున్నారు. పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు. అధికారికంగా పొత్తులు ఖరారు కాకపోయినా.. ఈ సీటు నుంచి తానే పోటీ చేస్తానని అనుచరులతో చెబుతున్నారు.
ముఖ్యంగా బాబూరావు బలం అంతా.. నియోజకవర్గంలోని నాలుగు మండలాలపై ఎక్కువగా కనిపిస్తోంది. కస్తూరిబాయి పేట, వాంబేకాలని, అజిత్ సింగ్ నగర్, రాజీవ్ నగర్ మండలాల పరిధిలోని మాస్ జనాలు.. బాబూరావుకుకొట్టిన పిండి. ఏ సమస్య ఉన్నా.. ఆయననిత్యం వారితోనే ఉంటున్నారు. నియోజకవర్గంలో ఆయన అనుచరులు కూడా భారీగానే ఉన్నారు. దీంతో మరోసారి ఆయనకు 30 వేల పైచిలుకు ఓట్లు వ్యక్తిగతంగా వచ్చినా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది.
ఇది అంతిమంగా ఇక్కడ నుంచి గెలుపు గుర్రం ఎక్కాలని భావిస్తున్న బొండా ఉమాకు ఎదురు దెబ్బగా మారనుందనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా బ్రాహ్మణ, వైశ్య సామాజిక వర్గం ఓట్లు గుండుగుత్తగా వైసీపీ కి పడే అవకాశం ఉంది. మిగిలిన కాపు, రెడ్డి సామాజిక వర్గాల ఓట్లు మాత్రమే బొండా ఉమాకు అనుకూలంగా ఉన్నాయి. అయితే.. ఆయన ఇంకా ప్రచారం ప్రారంభించకపోవడం.. ఆయా వర్గాలను కలుసుకోవడం కూడా.. ఇతర పార్టీల నేతలకు కలిసివస్తోంది. ఇక, ఇప్పటికైనా.. ఆయా వర్గాలను కలుసుకుంటే కొంత వరకు ఓటు బ్యాంకు ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉందని అంచనా.