ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఇక ఎన్నికలు ముగిసే వరకు ప్రచార యుద్ధం మామూలుగా ఉండదు. ఇటు అధికార వైసీపీ.. అటు ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి హోరా హోరీగా ఎన్నికల్లో తలపడనున్నాయి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ సీట్ల తో పాటు 25 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. అయితే ఈ సారి ఎన్నికల్లో చాలా చిత్ర విచిత్రాలు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకుంటున్నాయి.
గత ఎన్నికల్లోనే భార్య భర్తలు ఇద్దరూ వేర్వేరు పార్టీల తరపున పోటీ చేసిన సంఘటనలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో భార్య భర్తలు అయిన కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీ నుంచి విశాఖ ఎంపీగా పోటీ చేశారు. పురందేశ్వరి భర్త అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు బాపట్ల జిల్లా పరుచూరు నుంచి అసెంబ్లీకి వైసీపీ తరపున పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఈ ఇద్దరూ కూడా ఓడిపోయారు.
అయితే ఈ సారి ఏపి ఎన్నికల్లో ఏకంగా ఐదుగురు మాజీ సీఎంల తనయులు పోటీ చేస్తున్నారు. ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి మరోసారి తన కంచుకోట అయిన పులివెందుల నుంచే పోటీ చేయనున్నారు. ఇక మరో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి అసెంబ్లీ రేసులో ఉంటున్నారు. లోకేష్ గత ఎన్నికల్లో ఇదే మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ఇక టీడీపీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తనయుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం నుంచే పోటీ చేస్తున్నారు. ఆయన గత రెండు ఎన్నికల్లోనూ హిందూపురం నుంచే పోటీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలయ్య వరుసగా మూడోసారి హిందూపురం బరిలో ఉన్నారు. ఇక మరో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు తనయుడు నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీ పడుతున్నారు.
ఆయన గతంలో రెండుసార్లు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా పని చేయడంతో పాటు స్పీకర్ గా కూడా పనిచేశారు. ఇప్పుడు జనసేన నుంచి అక్కడ నాలుగోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ మనోహర్ తెనాలి నుంచి జనసేన అభ్యర్థిగానే పోటీ చేశారు. ఇక మరో మాజీ ముఖ్యమంత్రి అయిన కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి తనయుడు కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి ఈ సారి టీడీపీ నుంచి డోన్ అసెంబ్లీకి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
గత ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి కర్నూలు పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి డోన్ నుంచి అసెంబ్లీ బరిలో ఉంటున్నారు. ఇలా ఈ ఎన్నికల్లో ఏకంగా ఐదుగురు మాజీ ముఖ్యమంత్రుల కుమారులు పోటీ చేస్తున్నారు. వీరిలో జగన్, బాలయ్య, లోకేష్, కోట్ల సూర్యప్రకాశ్, మనోహర్ అందరూ కూడా అసెంబ్లీ కే పోటీ చేస్తుండడం విశేషం. అయితే ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం రాజమండ్రి నుంచి బీజేపీ తరపున పార్లమెంటుకు పోటీ చేస్తున్నారు.