ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ నుంచి పార్లమెంటు, అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను ఈ రోజు ఇడుపుల పాయ లో ప్రకటించారు. మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను ఒక్క అనకాపల్లి పార్లమెంటు స్థానం మినహాయిస్తే మిగిలిన 24 పార్లమెంటు స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు ఒకే జాబితాలో అభ్యర్థులను ప్రకటించేశారు. ఒక్క అనకాపల్లి లో సిట్టింగ్ ఎంపీ భీశెట్టి సత్యవతి స్థానం మాత్రమే పెండింగ్ లో ఉంది. ఇక అమలాపురంలో సిట్టింగ్ ఎంపీ చింతా అనూరాధను పక్కన పెట్టేసి ఆ స్తానంలో జనసేన నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద రావును ఎంపీ క్యాండెట్ గా బరిలోకి దించారు.
ఇక జగన్ ఈ సారి సోషల్ ఇంజనీరింగ్లో గతం కంటే కాస్త భిన్నంగానే వెళ్లారు. 25 పార్లమెంటు స్థానాల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 11 , ఓసీలకు 9 స్థానాలు కేటాయించారు. ఇక ఎంపీ + ఎమ్మెల్యే 200 స్థానాల్లో ఎస్సీలకు 33, ఎస్టీలకు 8, బీసీలకు 59, ఓసీలకు 100 సీట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు గత ఎన్నికల కంటే జగన్ అదనంగా మరో 11 సీట్లు కేటాయించారు. దీనిని బట్టి వీరికి ఏ స్థాయిలో ప్రాధాన్యం పెంచారో తెలుస్తోంది.
2019లో బీసీలకు 41 స్థానాలు ఇస్తే ఈ సారి మరో 7 పెంచి మొత్తం 48 స్థానాలు కేటాయించారు. ఇక మహిళలకు కూడా జగన్ ఈ సారి బాగా ప్రాధాన్యం ఇచ్చారు. 2019లో మహిళలకు 15 ఎమ్మెల్యే స్థానాలు ఇస్తే ఈ సారి మరో 4 అదనంగా పెంచారు. 2019లో మైనార్టీలకు 5 సీట్లు ఇస్తే.. ఈ సారి మరో 2 పెంచి మొత్తం 7 స్థానాలు మైనార్టీలకు కేటాయించడం విశేషం. 2019లో మహిళలకు మూడు ఎంపీ సీట్లు ఇస్తే.. ఈ సారి కూడా మూడు సీట్లు ఇవ్వడం విశేషం. ఇక ఎంపీ సీట్ల కేటాయింపు లోనూ జగన్ బీసీలకు బాగా ప్రాధాన్యం పెంచారు.
2019 ఎన్నికల్లో ఎస్సీలకు 4, బీసీలకు 12 సీట్లు ఇస్తే ఈ సారి అదనంగా మరో 4 సీట్లు పెంచడం విశేషం. ఇక 2019లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 89 సీట్లు ఇస్తే ఈ సారి అదనంగా 11 పెంచి మొత్తం 100 సీట్లు ఇవ్వడం విశేషం. ఏదేమైనా జగన్ ఈ సారి బీసీల్లో చాలా కులాలకు ప్రాదాన్యం బాగా పెంచినట్టుగా కనపడుతోంది. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా పలు ప్రాంతాలు, ఏరియాల్లో అక్కడ పట్టున్న బీసీ వర్గాలకు ఎక్కువ సీట్లు కేటాయించడం ద్వారా వారి ఓట్లు పొందే ప్రయత్నం జరిగినట్టుగా కనపడుతోంది.