ఏపీలో ఎన్నికల వేడి అయితే మామూలుగా లేదు. ఎన్నికల నోటిఫికేషన్ కూడా వెలువడింది. ఇక ఎన్నికలు ముగిసే వరకు ప్రధాన పార్టీల పోరు రంజుగా ఉండనుంది. ఇప్పటికే అధికార వైసీపీ ఒక వైపు.. ఇటు పొత్తులో భాగంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తో పాటు జనసేన కూడా కలిసి వైసీపీ ఢీ కొట్టేందుకు జట్టుకట్టాయి. పొత్తులో భాగంగా జనసేన కు 21 అసెంబ్లీ సీట్ల తో పాటు రెండు పార్లమెంటు స్థానాలు ఇస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే బీజేపీ కి 6 పార్లమెంటు సీట్లతో పాటు 10 అసెంబ్లీ స్తానాలు ఇస్తున్నారు.
ఇప్పుడిక టీడీపీ 144 ఎమ్మెల్యే,17 ఎంపీ సీట్లకు పోటీ చేయడం ఖాయం అయింది. పొత్తులలో భాగంగా ఎవరు ఏయే సీట్లలో పోటీ చేయాలనే దానిపై కసరత్తులు జరుగుతున్నాయి. ఇప్పటికే చాలా వరకు క్లారిటీ వచ్చేసిది. ముఖ్యంగా బీజేపీ ఏయే పార్లమెంటు.. ఏయే అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుందనే దానిపైనే చాలా వరకు స్పస్టత రావాల్సి ఉంది. ఇక ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి పొత్తులలో టీడీపీ మిత్రపక్షాలు గా ఉన్న జనసేన, బీజేపీ ఏయే సీట్లలో పోటీ చేస్తాయన్నదే క్లారిటీ లేదు.
దీనిపై రకరకాలుగా చర్చలు జరుగుతున్నాయి. పాలకొండ జనసేనకు, పాతపట్నం కూడా జనసేనకు ఖాయం అయ్యేలా ఉంది. గట్టిగా మాట్లాడితే జనసేనకు పలాస టికెట్ కూడా వచ్చేలానే ఉంది. అంటే జనసేనకు మూడు సీట్లు ఖాయం. ఒకటి బీజేపీకి ఖాయం అయ్యేందుకు పావులు కదుపుతున్నారు. ఆ విధంగా శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీకి దక్కే అవకాశాలున్నాయి. ఇక రెండో జాబితాలో కూడా కళా వెంకట్రావుకు ఛాన్స్ లేదు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేసే అవకాశాలున్నాయి.
కళా వెంకట్రావు టీడీపీలో చాలా సీనియర్. ఆయన ఎన్టీఆర్ టైం నుంచే పార్టీలో కొనసాగుతున్నారు. అప్పుడే ఆయన హోం మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత కళా వెంకట్రావు ఏపీ టీడీపీ అధ్యక్షులుగా కూడా పనిచేశారు. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా ఉంటూ.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉంటూ గత ఎన్నికల్లో ఓడిపోయారు.
ఇక ఇప్పుడు అలాంటి సీనియర్ ఎచ్చెర్లలో సీటు తెచ్చుకునేందుకు ఆపసోపాలు పడుతున్నారు.
ఎచ్చెర్లలో మాజీ జర్నలిస్టు,ఎర్రన్నాయుడు భక్తుడు కలిశెట్టి అప్పలనాయుడుకు ఛాన్స్ ఇచ్చేందుకు బాబు యోచిస్తున్నారు. అదేకనుక జరిగితే ఎచ్చెర్ల టీడీపీలో భారీ కుదుపు రావడం ఖాయం. మరో విషయం ఏంటంటే ఎచ్చెర్ల టికెట్ కూడా బీజేపీకే కేటాయించేందుకు అవకాశాలున్నాయి. ఇవన్నీ ఓ కొలిక్కి రావాల్సి ఉంది.