వచ్చేది ఏ ప్రభుత్వమో తెలియదు. కానీ, అటు వైసీపీ, ఇటు టీడీపీలు రెండూ కూడా సంతకాలు ప్రకటిం చాయి. దీంతో ఈ రెండు సంతకాలపై జనంలో చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం ఎన్డీయే కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో తలపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన తొలి సంతకం ప్రకటించారు. అయితే.. ఇది వివాదానికి దారితీయకపోవడం గమనార్హం. తాను అధికారంలోకి రాగానే.. తొలి సంతకం డీఎస్సీపైనే ఉంటుందని చంద్రబాబు ప్రకటించారు.
అది కూడా.. మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తానని చంద్రబాబు ప్రకటించడం గమనార్హం. ఇక, వైసీపీ అధినేత జగన్ కూడా తాజాగా రెండు రోజుల కిందట తన తొలి సంతకాన్ని ప్రకటించారు. తాను మరోసారి అదికారంలోకి వస్తే.. తొలి సంతకం .. వలంటీర్ల వ్యవస్థపైనే ఉంటుందని చెప్పారు. ఇక, ఇద్దరి సంతకాల వ్యవహారాన్ని చూస్తే.. రెండు హాట్ టాపిక్లే.. వైసీపీ హయాంలో ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ వేస్తామని చెప్పిన జగన్.. ఐదేళ్ల అధికారంలోఒక్కటి కూడా వేయలేక పోయారు.
అరకొర పోస్టులతో (6 వేలతో) డీఎస్సీ వేసినా.. అది ప్రస్తుత ఎన్నికలకు ముందు కావడంతో సక్సెస్ కాలేదు . తాజాగా ఎన్నికల సంఘం ఈ నోటిఫికేషన్పై బ్రేక్ వేసింది. దీంతో ఇది ఆగిపోయింది. ఫలితంగా ఒక్క డీఎస్సీ కూడా వేయని ప్రభుత్వంగా సీఎం జగన్ హయాం నిలిచిపోయింది. దీనిని కార్నర్ చేస్తూ.. చంద్ర బాబు నిరుద్యోగులను తనవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే ఆయన మెగా డీఎస్సీకి ప్రకటన చేశారు. తొలి సంతకం దీనిపైనే ఉంటుందన్నారు.
ఇక, చంద్రబాబు కు చెందిన కొందరు వ్యక్తులు వలంటీర్లను నిలుపుదల చేశారని… ప్రజలకు చేరువైన వలంటీర్లను ఎన్నికల సమయంలో ప్రజలకు దూరం చేశారని ఆరోపిస్తున్న సీఎం జగన్ ఈ విషయంపైనే తన తొలి సంతకం ఉంటుందని అన్నారు. అయితే.. ఈ రెండు అంశాలు కూడా.. కొన్నివర్గాలకు మాత్రమే పరిమితం కావడం గమనార్హం. ఎవరైనా ఎక్కడైనా విశేష సంఖ్యలో ప్రయోజనం కూర్చే పథకాలపై సంతకాలు చేస్తారు.
కానీ, ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన రెండు కీలక విషయాలపై కీలక నాయకులు ప్రకటన చేయడంతో పెద్దగా చర్చకు రాకుండానే పోయాయి. అయితే.. డీఎస్సీపై నిరుద్యోగులు కొంత మేరకు ఆశలు పెట్టుకున్నారు. అయితే.. జగన్ చేసిన ప్రకటనతో వలంటీర్లు కూడా ఆశలు పెట్టుకున్నారు. అంటే.. రెండు భిన్నమైన అంశాలపై ఇద్దరు వాగ్దానం చేయడంతో పెద్దగా ఇది రాజకీయ చర్చకు రాకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది.