ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో నియోజకవర్గాలు ఉన్నా.. ఈ నియోజకవర్గంలో మాత్రం.. చాలా ఎక్కువే చర్చ నడుస్తోంది. దీనికి కారణం.. టీడీపీ నుంచి పోటీ చేసి గత ఎన్నికల్లో ఓడిపో యినా.. మొక్కవోని ధైర్యంతో ఇప్పుడు కూడా తలపడుతున్న గౌతు శిరీషే. ఇంటింటి ప్రచారం ప్రారంభించకపోయినా.. శిరీష గురించి మాత్రం ఇంటింటా చర్చ సాగుతోంది. ఈ సారి విజయం తమదేనని టీడీపీ నేతలు చెబుతున్నారు. సరే.. ఈ విషయం ఎలా ఉన్నా.. అధికార పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కమ్ మంత్రి సీదిరి అప్పలరాజు కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన ఇక్కడ చేసిన అభివృద్ది గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. కరపత్రాలు వేసి.. అనధికార వలంటీర్లతో ఇంటింటికీ పంపిణీ చేయిస్తున్నారు. దీనిలో ప్రధానంగా ఉద్దానంలో కిడ్నీ సెంటర్ను ప్రస్తావిస్తున్నారు. దీనిని తాము అధికారం లోకి వచ్చాకే నిర్మించామని చెబుతున్నారు. అదేవిధంగా మంచి నీటి ప్రాజెక్టును కూడా నిర్మించిన విషయాన్ని ఊదర గొడుతు న్నారు. పదే పదే తన గొప్పలు చెప్పుకొంటున్నారు. అయితే.. ఎవరు ఎన్నయినా చెప్పుకోవచ్చు. కానీ, అంతిమంగా ప్రజలు ఏంటనేది తేలుస్తారు. ఈ విషయంలో సీదిరి అప్పలరాజు చేస్తున్న ప్రసంగానికి 5 శాతం మార్కులే పడుతున్నాయి. ఇది వాస్తవం.
`ఔను.. ఉద్దానంలో కొంత అభివృద్ది జరిగింది. అది కేవలం 5 శాతం.. అంతకంటే తక్కువ !` అనే వారే ఎక్కువుగా ఉన్నారు. అంతేకాదు, `మావోడే మాకు కాకుండా పోయాడు` అని సొంత మత్య్సకార కుటుంబాలే దెప్పిపొడుస్తున్నాయి. ఇక, వైసీపీలోనే రెండు వర్గాలుగా చీలిపోయిన వారు.. ఎప్పుడో ఏడాది కిందట నుంచి సీదిరి వ్యతిరేకంగా ఇక్కడ చక్రం తిప్పుతున్నాయి. ఇవి కూడా.. 90 శాతం ప్రభావితం చూపిస్తున్నాయి. మరీముఖ్యంగా తన దురుసు ప్రవర్తన.. తన వ్యవహార శైలి వంటివి సాధారణ ప్రజలకు సీదిరిని దూరం చేశాయి. `డాటర్ గారు మారిపోయారు` అనే టాక్ వినిపిస్తోందంటే.. అది ఏ రేంజ్లో ప్రభావితం చూపిస్తోందో అర్ధం చేసుకవచ్చు.
గత ఎన్నికల్లో ఏ పార్టీకి ఆ పార్టీ పోటీలో ఉన్నప్పుడే.. కేవలం 16 వేల ఓట్ల ఆధిక్యతతో సీదిరి విజయం దక్కించుకున్నారు. కానీ, ఇప్పుడు మూడు పార్టీలు కలిశాయి. దీనికి తోడు ఆయనకు 10 శాతం అనుకూల మాత్రమే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీదిరి పరిస్థితి ఏంటి? అనేది ప్రధానంగా చర్చకు వస్తోంది. అంతేకాదు.. కాంగ్రెస్ తరఫున మజ్జి త్రినాధ్ బాబు పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ ఓటు బ్యాంకు చీలి పోవడం ఖాయమని తెలుస్తోంది. ఇదే జరిగితే సీదిరికి ఇప్పుడు చెబుతున్న 10 శాతం అనుకూలత కూడా తగ్గడం ఖాయమనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. మరి మిగిలిన 90 శాతం అనుకూలత ఇప్పుడున్న పరిస్థితిలో టీడీపీ వైపే ఉండడం విశేషం. దీనిని సీదిరి ఎలా తట్టకుంటారో చూడాలి.