Breaking: అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ఆదివారం వేకువజాము వేర్వేరు చోట్ల రెండు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఒక కార్మికుడు మృతి చెందగా, మరో ఆరుగురు కార్మికులు అస్వస్థతకు గురైయ్యారు. అయితే ఈ విషయాన్ని పరిశ్రమల యాజమాన్యం గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించారు.
విషయంలోకి వెళితే.. రామ్కీ ఫార్మసిటీలోని ఎపిటోరియా యూనిట్ 4 ఫార్మా కంపెనీలో వేకువజామున రియాక్టర్ మేన్ హోల్ పేలి ఎగిరిపడింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆళ్ల గోవింద్ (30) అనే కార్మికుడు మేన్ హోల్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు విశాఖపట్టణం పెదగంట్యాల మండలం శ్రీహరిపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. గోవింద్ మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్ మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరో పక్క ఫార్మా సిటీలోనే అల్కలి మెటల్స్ లిమిటెడ్ యూనిట్ 3లో తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. మైతల్ నైట్రేట్ కెమికల్ వాయువు లీక్ అవ్వడంతో సీహెచ్ రమణ అనే కార్మికుడు తీవ్రంగా అస్వస్థతకు గురైయ్యారు. మరో అయిదుగురు కార్మికులు కార్మికులు కూడా అస్వస్థతకు లోనయ్యారు. వీరిని అనకాపల్లిలోని శ్రీరామ ఆసుపత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నారు.
ఫార్మా సిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గనిశెట్టి సత్యనారాయణ ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫార్మాసిటీలో కార్మికుల ప్రాణాలను యాజమాన్యాలు గాలికి వదిలివేస్తున్నాయని, భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అన్నారు. ఇలాంటి కంపెనీలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
వెంటనే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్యాక్టరీస్ ఆఫ్ ఇన్స్ పెక్టర్ వారు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటి వరకూ బాధిత కుటుంబాలకు ప్రమాద విషయాలు తెలియచేయకపోవడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ప్రమాదంపై పూర్తి విచారణ జరిపించాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.