అమరావతి: ఏపీ సీఎం వైఎస్ జగన్ ను ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు శుక్రవారం భేటీ అయ్యారు. తన తల్లిదండ్రులతో కలసి అమరావతిలోని సచివాలయానికి వచ్చిన పీవీ సింధు… ముఖ్యమంత్రిని కలిసింది. ఈ సందర్భంగా వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించిన సింధును శాలువా కప్పి జగన్ సత్కరించారు. ఆమెకు అభినందనలను తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం సెక్రటేరియట్ లో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలసి పివి సింధు మీడియాతో మాట్లాడారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను అభినందించడం సంతోషంగా వుందని సింధు అన్నారు. భవిష్యత్తులోనూ ఎప్పుడూ అండగా వుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు. వైజాగ్ లో అకాడమీ నెలకొల్పేందుకు ఐదు ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని తెలిపింది. అన్ని రకాలుగా సాయం చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించింది. పద్మభూషణ్ కోసం కేంద్రం తన పేరును నామినేట్ చేసినట్లు తెలిసిందని, చాలా సంతోషంగా ఉందన్నారు. దీనిపై ఇంకా అధికారికంగా సమాచారం రాలేదని తెలిపారు.
గోల్డ్ మెడల్ సాధించిన తరువాత మొట్టమొదటి సారిగా ఏపీకి వచ్చిన పివి సింధుకు ఘనంగా ఆహ్వానం పలికామని రాష్ట్ర క్రీడాశాఖామంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. వచ్చే ఒలంపిక్స్ లో కూడా సింధు గోల్డ్ మెడల్ సాధించాలని సిఎం కోరుకున్నారని తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఆడపిల్లలకు ఒక బ్యాడ్మింటన్ అకాడమీ వుంటే బాగుంటుందని పివి సింధు కోరిన మీదట విశాఖపట్నంలో 5 ఎకరాలను కేటాయిస్తామని సిఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా ప్రభుత్వం డగా వుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. తెలుగు అమ్మాయి అయిన సింధూకు అన్నిరకాల ప్రోత్సాహం ఇవ్వాలని సిఎం ఆదేశించినట్లు తెలిపారు. ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో సింధు గోల్డ్ మెడల్ సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు సాధించిన సంగతి తెలిసిందే.
అమరావతి: వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు, ముఖ్యమంత్రి శ్రీ వైయస్. జగన్మోహన్ రెడ్డిని సచివాలయంలో కలుసుకున్నారు. సింధుకు గౌరవ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. సింధు తల్లిదండ్రులతో పాటు, మంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్, శాప్ అధికారులు ఉన్నారు. pic.twitter.com/6fVSctff0G
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) September 13, 2019