అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా తాము నిర్ణయం తీసుకోలేదని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామని వైసీపీ అధినేత, ప్రస్తుత సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా చేస్తామని ఆయన చెప్పారు. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు తర్వాత ఈ అంశంపై ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
ఏపీలో ఈ నెల 17 నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఏపీలో భూముల రీసర్వే కోసం రూ.1800 కోట్లు ఖర్చు పెట్టబోతున్నామని తెలిపారు. డెన్మార్క్ దేశంలో జరిగిన భూసర్వేను అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాన్ని పంపే విషయాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం ఏపీలో 13 జిల్లాలు ఉండగా.. కొత్తగా మరో 12 జిల్లాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ప్రచారం జరిగింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన విషయమై ఇప్పటికే సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్తో కూడా చర్చించినట్లు వార్తలు వినిపించాయి. పరిపాలనా సౌలభ్యం కోసమే తెలంగాణ తరహాలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు. కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రక్రియను నాలుగు నెలల్లోపు పూర్తిచేసి.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం నాడే అమల్లోకి తీసుకురావాలని జగన్ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజాగా డిప్యూటీ సీఎం ప్రకటనతో ఇప్పట్లో కొత్త జిల్లాలు ఏర్పాటు అయ్యే అవకాశం లేదనట్లు తెలుస్తోంది.