ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం, వైసీపీ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో విచిత్రమైన రాజకీయ పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీకి దగ్గరైన విషయం అందరికి తెలిసిందే. అయన నేరుగా వైసీపీ కండువాను కప్పుకోకపోయినా ఆయన కుమారుడు కరణం వెంకటేశ్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేర్పించారు. ఈ పరిణామం నియోజకవర్గ వైసీపీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి వర్గీయులకు ఏమాత్రం నచ్చలేదు. నేతలు ఇద్దరూ బాగానే ఉన్నప్పటికీ…వారి అనుచరులు మాత్రం కలవలేకపోతున్నారు. చీటికీ మాటికీ గొడవలు పడుతున్నారు. వైసీపీ కార్యక్రమాలను కూడా ఎవరికి వారే నిర్వహించుకుంటున్నారు.
తాజాగా వేటపాలెం మండలం రామపురంలో కరణం బలరాం వర్గీయులు (టీడీపీకి చెందిన వారు), అమంచి కృష్ణమోహన్ (వైసీపీ) వర్గీయుల మధ్య జరిగిన చిన్న గొడవ చివరకు ఉద్రిక్తంగా మారింది. రామలింగయ్య అనే వ్యక్తి స్థలంలో రాజారావుకు చెందిన కర్రలను తీయమనడంతో చిన్నగా గొడవ ప్రారంభమైంది. చివరకు ఇది ఇరు వర్గాలు కొట్టుకునే వరకు వెళ్లింది. వారం రోజుల నుంచే గ్రామంలో వాతావరణం వేడెక్కినట్లు సమాచారం. గ్రామ కాపును ఎన్నుకునే విషయంలో ఇరు వర్గీయుల మధ్య వివాదం జరుగుతోంది. ఆ వివాదంతో పాటు ఈ రోజు మరో చిన్న కారణంతో ఇరు వర్గాలు కొట్టుకునేంత వరకు వెళ్లింది. ఘర్షణ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్న ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించారు.
గత ఏడు రోజులుగా వివాదం నడుస్తున్నప్పటికీ తాజాగా జరిగిన గొడవలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.