TTD: హనుమంతుడి జన్మస్థానం తిరుమల సప్తగిరుల్లోని ఆంజనాద్రి పర్వతంగా నిరూపించేందుకు ఈ నెల 21 శ్రీరామనవమి పర్వదినం రోజున టీటీడీ సిద్ధమవుతోంది. ముందుగా ఉగాది రోజున శాస్త్రీయ ఆధారాలతో నిరూపించనున్నట్లు ప్రకటించిన టీటీడీ దీన్ని మార్పు చేసింది. ఆంజనేయుడు శ్రీరాముడి ప్రియభక్తుడైనందున శ్రీరామనవమి రోజున ఆయన జన్మదిన వృత్తాంతాన్ని వెల్లడించాలని తాజాగా నిర్ణయించింది. ఆ రోజునే పురాణాలు, శాసనాలు, శాస్త్రీయ ఆధారాలతో టీటీడీ నిరూపించనున్నది.
అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలంగా దృవీకరించే సాక్షాల గురించి సమగ్రంగా అధ్యయనం చేయడానికి టీటీడీ కార్యనిర్వహణ అధికారి జవహర్ రెడ్డి గత ఏడాది డిసెంబర్ నెలలో టీటీడీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రాజెక్టు అధికారి డాక్టర్ ఆకెళ్ల విభీషణ శర్మ నేతృత్వంలో మురళీధర శర్మ, సుదర్శన్ శర్మ, రామకృష్ణ, శంకర నారాయణలతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ సభ్యులు అనేక మార్లు సమావేశమై చర్చించారు. ఆంజనేయుడు ఎక్కడ జన్మించాడన్న విషయంపై కఛ్ఛితంగా నిర్ధారించేందుకు కమిటీ అయిదు పురాణాలను, అనేక గ్రంధాలయను పరిశీలించింది. పుజా విధానాలు, పురాణాలు, అతి హాసాలు, ఇలా మూడు చారిత్రక ఆధారాలతో హనుమంతుడి జన్మస్థానంపై ఒక నిర్ణయానికి వచ్చింది. స్కంద పురాణం, వరహా పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, వెంకటాచల మహత్యం వంటి పురాణాలలో ఉన్న అధారాలను కమిటీ సేకరించడంతో పాటు ఇస్రో శాస్తవేత్తల సహకారంతో శాస్ర్తీయ ఆధారాలను కూడా కమిటీ సేకరించింది. అదే విధంగా అన్నమాచార్య ఏడు కీర్తనలోనూ హనుమంతుడి జన్మస్థలం గురించి ప్రస్తావన ఉన్నట్లు కమిటీ పేర్కొంది.
TTD: నాడు డాక్టర్ చిదంబర శాస్త్రి చెప్పిందే నేడు నిరూపితమైంది
అయితే ఈ కమిటీ ఏర్పాటుకు పూర్వమే ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన హనుమత్ ఉపాసకులు డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి వివిధ పరిశోదనలు చేసి గత అర్థ శతాబ్దంగా హనుమంతుడి జన్మస్థలం అంజనాద్రి అని ప్రచారం చేస్తున్నారు. ఆంజనేయుడు జన్మించిన స్థలానికి సంబంధించి అనేక వివరాలను టీటీడీకి గతంలోనే అందించారు. ఆంజనేయుడి జీవితంపై పిహెచ్ డీ చేసిన చిదంబర శాస్త్రి అనేక పురాణాలు, గ్రంధాలతో పాటు హనుమచ్ఛరిత్రకు ప్రామాణికమైన శ్రీపరాశర సంహిత తాళపత్ర గ్రంధం అధ్యయనం చేసి పలు ఆశక్తికమైన విషయాలను సేకరించారు. తన అధ్యయనం ద్వారా అంజనాద్రి ఆంజనేయుడి జన్మస్థలం అని నిర్ధారణకు వచ్చిన చిదంబర శాస్త్రి ఆ వివరాలను టీటీడీకి సమర్పించడంతో పాటు కరపత్రాల ద్వారా ప్రజల్లోనూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఆయన సంతకాల సేకరణ కూడా చేపట్టారు. అంతే కాకుండా తిరుమలలోని జాపాలి తీర్థం వద్ద ఆంజనేయస్వామి వారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టీటీడీతో పాటు దేవాదాయ శాఖకు పలు మార్లు ఉత్తరాలు కూడా రాశారు. హనుమత్ దీక్ష పుస్తకాన్ని ఆయన రచించారు.
హనుమంతుడి జన్మస్థలం జార్ఖండ్ రాష్ట్రం అని కొందరు కాదు హంపి అని మరి కొందరు ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో చిదంబర శాస్త్రి తాను సేకరించి ఆధారాలతో తిరుమలలోని అంజనాద్రి స్వామివారి జన్మస్థానం అని ప్రచారంలోకి తీసుకువచ్చారు. టీటీడీ ఇఓ జవహార్ నియమించిన కమిటీ కూడా చిదంబర శాస్త్రి ఇచ్చిన వివరాలను పరిశీలించిట్లు సమాచారం. ఆంజనేయుడి జన్మస్థానం విషయంలో టీటీడీ ఒక నిర్ణయానికి వచ్చి శ్రీరామనవమి రోజున అధారాలను బహిర్గతం చేయనున్న నేపథ్యంలో తన జీవిత లక్ష్యం నెరవేరిందని డాక్టర్ చిదంబర శాస్త్రి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. హనుమంతుడి జన్మస్థలంలో భవ్య మందిరం నిర్మాణం జరగాలన్నది తన కోరిక అని చిదంబర శాస్త్రి పేర్కొన్నారు. అర్ధ దశాబ్ద కాలంగా తాను చేస్తున్న పోరాటం ఫలించిందన్నారు చిదంబర శాస్త్రి.
ఎవరీ చిదంబర శాస్త్రి
ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన డాక్టర్ చిదంబర శాస్త్రి ఒంగోలులోని ఓరియంటల్ కళాశాల, తిమ్మసముద్రంలోని సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా పని చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం వివిధ అధ్యాత్మక ఛానళ్లలో ధర్మ సందేహాలను నివృత్తి చేస్తూ ఉపన్యాసాలు చేస్తున్నారు. హనుమంతుడి జన్మస్థలంకు సంబంధించి డాక్టర్ చిదంబర శాస్త్రి రాసిన వ్యాసాలు టీటీడీ పత్రిక సప్తగిరితో పాటు జార్ఖండ్, కన్నడ పత్రికల్లోనూ ప్రచురితం అయ్యాయి.