(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి)
ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఇప్పటికే వ్యవసాయ రంగంలో ఉచిత విద్యుత్ విధానానికి నగదు బదిలీ ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అప్పుడే విపక్షాల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడం, ఆందోళనలకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం మరో నగదు బదిలీ పథకానికి అడుగులు వేస్తున్నది. చౌక ధరల దుకాణాల (రేషన్ షాపులు) ద్వారా ప్రతినెలా కార్డుదారులకు పంపిణీ చేసే బియ్యం స్థానంలో బియ్యం బదులు నగదు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బియ్యం కావాలనుకున్న వారికి బియ్యం, బియ్యం వద్దనుకునే వారికి నగదు ఇవ్వాలని భావిస్తున్నది. రేషన్ షాపుల్లో ఈ నగదు బదిలీపై అధ్యయనం చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే సీఎం జగన్మోహనరెడ్డికి నివేదిక సమర్పించగా ఆయన ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు విరమించుకున్న ప్రతిపాదనకు జగన్ గ్రీన్ సిగ్నల్
గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు రేషన్ షాపులో బియ్యం బదులు నగదు బదిలీపై ఆలోచన చేశారు. అయితే పౌరసరఫరాల శాఖ ద్వారా నిర్వహించే ఈ పథకంలో మేజర్ షేర్ కేంద్ర ప్రభుత్వానిదే. జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా అమలు అవుతున్న ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు, చేర్పులు చేస్తే కేంద్రం అంగీకరిస్తుందో లేదో తెలియదు. దీనికి తోడు ఈ బియ్యం బదులు నగదు బదిలీ చేస్తే రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు నిలిపివేయాల్సి వస్తుంది. దీంతో ఈ రకం ధాన్యం పండించే రైతాంగం ఆందోళన చేసే అవకాశం ఉంది. నగదు బదిలీ ప్రవేశపెట్టడం వల్ల లాభనష్టాలను అంచనా వేసిన గత తెలుగుదేశం ప్రభుత్వం దాన్ని ఆచరణలో పెట్టలేదు.
నగదు బదిలీ ఆలోచన ఎందుకంటే
దశాబ్దాల కాలంగా రేషన్ షాపుల్లో కార్డుదారులకు లావు రకం బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం దాదాపు కేజీ 25 రూపాయలకు కొనుగోలు చేసి కార్డుదారులకు కేజీ ఒక రూపాయి చొప్పున పంపిణీ చేస్తున్నది. అయితే ఎక్కువ శాతం మంది సన్న బియ్యం (శాంబ మసూరి)కి అలవాటు పడటం వల్ల రేషన్ షాపుల నుండి సరఫరా చేసే లావు రకం బియ్యం తినడం లేదు. దీంతో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. రేషన్ బియ్యం అక్రమ రవాణా నిరోధించాలంటే ప్రజలు ఉపయోగించుకునే సన్నరకం బియ్యం పంపిణీ చేయడం గానీ లేక ఆ బియ్యం బదులు నగదు పంపిణీ అమలు చేయాల్సి ఉంటుంది.
నాణ్యమైన బియ్యం పంపిణీకి జగన్ హామీ
ప్రస్తుత సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి ఎన్నికలకు ముందు పాదయాత్ర సమయంలో చాలా మంది ప్రజలు రేషన్ బియ్యం సమస్యను వివరించారు. ఈ బియ్యం తినలేక బయట అమ్ముకుని ఎక్కువ ధర పెట్టి సన్న బియ్యం కొనుగోలు చేసుకోవాల్సిన వస్తుందని వివరించారు. ఈ సందర్భంలోనే జగన్ దీనిపై హామీ ఇచ్చారు. ప్రజలు తినదగిన నాణ్యమైన బియ్యం రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేస్తామని నాడు జగన్ హామీ ఇచ్చారు. అయితే ఏడాదిన్నర కావస్తున్నా రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాలేదు. అయితే పైలెట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం నాణ్యమైన బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతోంది. జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రజలకు ఇచ్చిన సన్నబియ్యం పంపిణీ హామీ తుంగలో తొక్కిందని టిడిపి నేతలు విమర్శిస్తుంటే “మీ అమ్మ మొగుడు చెప్పాడా సన్న బియ్యం ఇస్తామనీ, నాణ్యమైన బియ్యం ఇస్తాం” అని మాత్రమే హామీ ఇచ్చామని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విరుచుకు పడటం చూశాం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేయడం ప్రస్తుతం సాధ్యపడే పరిస్థితులు లేనందు వల్ల నగదు బదిలీకి ప్రజలు కూడా సుముఖత వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నది. అయితే దీనిపైనా కోర్టు వివాదాలు రాకుండా ఉండేందుకు గానూ ముందు జాగ్రత్తగా బియ్యం కావాల్సిన వారికి బియ్యం, బియ్యం వద్దు అన్నవారికి మాత్రమే నగదు బదిలీ చేయడం జరుగుతుందని చెప్పడం వల్ల న్యాయపరమైన చిక్కులు వచ్చే అవకాశం లేదంటున్నారు.