పూలపండుగ. ప్రపంచంలోనే అతివిశిష్టమైన ఒక ప్రకృతి పండుగ బతుకమ్మ. ఎంగిలిపూల బతుకమ్మ అమావాస్య నాడు ప్రారంభమైన బతుకమ్మ సంబరాలు ఆశ్వయుజ అష్టమితో ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులలో ఆడపడుచులు రోజుకో రూపంలో బతుకమ్మను ఆరాధిస్తారు.
తొమ్మిది రకాల నైవేద్యాలు
అచ్చం శ్రీవిద్య ఉపాసకులు చేసే మంత్ర, తంత్రరహస్యాల నిగూఢ విద్యనే అందరు ఆచరించేలా రూపొందించిన పండుగ బతుకమ్మ. ఈ పండుగలో విశేషాలు చూస్తే…
పూలు, నైవేద్యాలు. తొమ్మిది రోజులు జరుపుకునే ఈ పండుగ వేడుకలో ఒక్క రోజు మినహా మిగిలిన ఎనిమిది రోజులు ఒక్కోక రకమైన నైవేద్యం సమర్పిస్తారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో మొదటిరోజు బతుకమ్మను ఎంగిలిపువ్వు బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు.
16 అక్టోబర్ శుక్రవారం, అమావాస్య రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మని పేర్చారు. అమావాస్య నుండి 24 అక్టోబర్ శనివారం రోజు సద్దుల బతుకమ్మని “దుర్గాష్టమి” మహర్నవమిగా వేడుక చేసుకుంటారు.
తేదీల ప్రకారం…
16 అక్టోబర్ శుక్రవారం, అమావాస్య రోజు ఎంగిలి పూల బతుకమ్మ – నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా పెడతారు.
17 అక్టోబర్ శనివారం రోజు అటుకుల బతుకమ్మ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు చేస్తారు. ( దేవి శరన్నవరాత్రులు ప్రారంభం ) సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.
18 అక్టోబర్ ఆదివారం రోజు ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి నివేదిస్తారు.
19 అక్టోబర్ సోమవారం రోజు నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి.
20 అక్టోబర్ మంగళవారం రోజు అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.
21 అక్టోబర్ బుధవారం రోజు అలిగిన బతుకమ్మ: ఈ రోజు నైవేద్యం సమర్పించరు.
22 అక్టోబర్ గురువారం రోజు వేపకాయల బతుకమ్మ : బియ్యం పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారుచేసి నైవేద్యంగా సమర్పిస్తారు.
23 అక్టోబర్ శుక్రవారం రోజు వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి బెల్లం కలిపి నైవేద్యంగా తయారుచేస్తారు.
24 అక్టోబర్ శనివారం రోజు సద్దుల బతుకమ్మ : ఆశ్వీయుజ అష్టమి రోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, కొబ్బరన్నం, నువ్వులన్నం అనే ఐదురకాల నైవేద్యాలు తయారు చేసి నైవేద్యంగా నివేదించాలి. తొమ్మిది రోజులపాటు బతుకమ్మ పూజించిన మహిళలు చివరి రోజైన సద్దుల బతుకమ్మ నాడు చెరువులో నిమజ్జనం చేస్తారు. మేళతాళలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారిని గంగమ్మలో కలుపుతారు. పూలతో తయారు చేసిన బతుకమ్మపై పసుపుతో తయారు చేసిన గౌరవమ్మను మహిళలు తమ మంగళ సూత్రాలకు పూసుకుంటారు. బెల్లం లేదా చక్కెర కలిపి తయారు ‘మలీద’ను అందరికీ పంచితే శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం. ఇలా తొమ్మిది రోజులు ప్రకృతి స్వరూపిణి అయిన అమ్మవారిని సంగీత, నృత్య గీతాదికమలతో రకరకాల నైవేద్యాలతో భక్తి, శ్రద్ధలతో తన్మయత్వంతో ఆరాధిస్తారు. ఇది సాక్షాత్తు శ్రీవిద్యను అందరు ఆచరించేలా పూర్వీకులు ఏర్పర్చిన విశిష్టమైన పండుగ.