ఇకపై కరోనా టెస్ట్ లకు వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. తక్కువ ఖర్చుతో పరీక్ష చేసే కరోనా కిట్ లు అందుబాటులోకి వచ్చేసాయి. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కు చెందిన ఐఐటీ ఢిల్లీ ప్రొఫిసర్ రాంగోపాల్ రావు ఈ కిట్ లను రూపొందించారు.
ఆర్టీ-పీసీఆర్ ఆధారిత కరోనా పరీక్ష కిట్ను ఐఐటీ ఢిల్లీ రూపొందించగా, న్యూటెక్ మెడికల్ కంపెనీ దీనిని వాణిజ్యపరంగా తయారు చేసి ‘కోరోసూర్’ పేరుతో మార్కెట్ లోకి విడుదల చేసింది. తమ కరోనా పరీక్ష కిట్ ధర సుమారు రూ.650 ఉంటుందని ఆ సంస్థ ఎండీ జతిన్ గోయల్ వెల్లడించారు. ఇతర దేశాలతో పోల్చితే ఈ కిట్ చాలా చౌక అని అయన చెప్పారు. ‘కోరోసూర్’ పరీక్ష కిట్ రాకతో దేశంలో కరోనా పరీక్షల తీరు మారుతుందని అయన అన్నారు.
ప్రపంచంలోనే అతి చౌక అయిన ఈ కరోనా పరీక్ష కిట్ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి (హెచ్ఆర్డీ) శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్.. ఆ శాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రేతో కలిసి ఆన్లైన్లో ఆవిష్కరించారు. ఐఐటీ ఢిల్లీ సాంకేతికతో న్యూటెక్ మెడికల్ డివైసెస్ సంస్థ తయారు చేసిన ఈ కిట్ ద్వారా అతి తక్కువ ఖర్చుతో ఒక నెలలో సుమారు 20 లక్షల కరోనా పరీక్షలు చేయవచ్చని రాంగోపాల్ రావు తెలిపారు. టెస్ట్ ఫలితం కేవలం మూడు గంటల వ్యవధి వస్తుందన్నారు. తమ కరోనా పరీక్ష కిట్ను భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ఆమోదించినట్లు ఆయన తెలిపారు.
ప్రస్తుతం ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా పరీక్షలకు 2500 రూపాయల నుండి నాలుగు వేల వరకు ఖర్చు అవుతున్న సంగతి తెలిసిందే.