CBSE: దేశంలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో మే నెలలో జరగనున్న సీబీఎస్ఈ వార్షిక పరీక్షల విషయంలో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే 12వ తరగతి పరీక్షలను మాత్రం వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ పరీక్షలను రద్దు చేయడం లేదని ఇప్పటి వరకూ కేంద్ర విద్యాశాఖ చెబుతోంది. దాదాపు అయిదు రాష్ట్రాల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదు అవుతున్నాయి. ఈ తరుణంలో ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ వద్రా, రియల్ హీరో సోనూ సూద్ తదితరులు సీబీఎస్ఈ పరీక్షలు రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ బుధవారం కీలక ప్రకటన వెల్లడించింది.
దేశంలో కరోనా మహామ్మారి విస్తరిస్తున్న ఈ తరుణంలో విద్యార్థుల భద్రతలను దృష్టిలో పెట్టుకుని మే 4 నుండి జరిగే సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నామని తెలియజేస్తూ బోర్డు తయారు చేసే అబ్జెక్టివ్ క్రైటీరియా ఆధారంగా పదవ తరగతి ఫలితాలు ప్రకస్తామని తెలిపింది. ఇక 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 1వ తేదీన కరోనా పరిస్థితిపై సమీక్ష జరిపి 12 వ తరగతి పరీక్షల తేదీలను ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ ప్రొఖ్రియాల్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పరీక్షలు ప్రారంభించడానికి 15 రోజుల ముందుగానే వివరాలు వెల్లడిస్తామన్నారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వార్షిక పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ లు వెల్లువెత్తుతున్న దృష్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేడు కేంద్ర మంత్రి రమేష్ పోభ్రియాల్, ఉన్నత విద్యాశాఖ అధికారులతో సమావేశమై చర్చించారు. అనంతరం ప్రధాన మంత్రి మోడీ సూచనల మేరకు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.